హైదరాబాద్, జూలై13 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేయడం అసమంజసమని, దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర నేతృత్వంలో ఢిల్లీలో గురువారం రెండో రోజూ విచారణ కొనసాగింది. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా ఏపీ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ దీనిని ఆక్షేపిస్తూ వాదనలు వినిపించారు. మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ ద్వారా 45, గోదావరికి కృష్ణా జలాలను మళ్లించడం ద్వారా వచ్చే 45 టీఎంసీలను కలిపి మొత్తంగా 90 టీఎంసీలను పాలమూరు ప్రాజెక్టుకు తెలంగాణ కేటాయించిందని వెల్లడించారు.
ఈ మేరకు డీపీఆర్ను కూడా సమర్పించిందని గుర్తుచేశారు. మైనర్ ఇరిగేషన్ కింద కేటాయించిన 89 టీఎంసీల్లో 45 టీఎంసీలను ఇప్పటికీ తెలంగాణ వినియోగించడం లేదని, 45 టీఎంసీలు వాడుకోలేని పరిస్థితి ఉందని వివరించారు. తెలంగాణకు ఉమ్మడి ఏపీ పాలకులే కాకుండా, ప్రస్తుత విభజిత ఏపీ పాలకులు కూడా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు కేటాయించిన మొత్తం 299 టీఎంసీల వినియోగం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ను, గోదావరి మళ్లింపు జలాలను పాలమూరుకు కేటాయించుకునే హక్కు, అర్హత తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్-89 కింద ప్రాజెక్టులకు సమానమైన కేటాయింపులు చేసే అధికారం తమకు లేదని ట్రిబ్యునల్ చైర్మన్ వెల్లడించగా, ఆ అధికార పరిధి లేకపోతే ఏపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిధి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పాలమూరుపై ఏపీ దాఖలు చేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకోవద్దని, పరిశీలనకు అనుమతించవద్దని ట్రిబ్యునల్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వాదనలు పూర్తి కావడంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. నేడు ఏపీ తన వాదనలను వినిపించనుంది.