CM Jagan | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో చురుగ్గా పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాళ్లదాడికి తెగబడ్డారు. విజయవాడలోని సింగ్నగర్ ప్రాంతంలో దాభాకొట్ల సెంటర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సీఎం జగన్కు ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. రాయి దెబ్బకు ‘వై’ ఆకారంలో కనుబొమ్మపైన శరీరం చిట్లిపోయింది. జగన్తోపాటు ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి సైతం గాయపడ్డారు. దుండగులు గుల్లేరుతో గురి తప్పకుండా కొట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు పైనుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. గాయం తగిలిన వెంటనే బస్సులోని వైద్య సిబ్బంది జగన్కు ప్రథమ చికిత్స చేశారు.
జగన్పై రాళ్లదాడి జరిగిందని తెలిసిన వెంటనే వైసీపీ శ్రేణులు విజయవాడలో ఎక్కడికక్కడే ఆందోళనలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ సిటీలోకి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర రావడంతో జగన్ను చూసేందుకు జనం పోటెత్తారు. అప్రతిహతంగా కొనసాగుతున్న బస్సుయాత్రను, భారీగా వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేకనే టీడీపీ వర్గాలు ఈ దాడికి పాల్పడ్డాయని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించిన వారి గురించి ఆరా తీస్తున్నారు. రాళ్ల దాడి జరిగినప్పటికీ.. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ తన బస్సుయాత్రను కొనసాగించారు.
ఏపీ సీఎం జగన్పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా ఖండించారు. ‘జగన్ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల సంఘం ద్వారా కఠినమైన చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని హరీశ్రావు పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం జగన్పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. జగన్ సోదరి, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ.. రాళ్ల దాడిలో జగన్ గాయపడటం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఈ హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాలని కోరారు. జగన్పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.