తిమ్మాపూర్, జూన్ 21: కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ప్రయాణికులతో హైదరాబాద్ జేబీఎస్కు బయలుదేరింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ శివారులో కాకతీయ కాలువ దాటిన తర్వాత బస్సులో కాలిపోతు న్న వాసనతోపాటు సిగ్నల్స్ రావడంతో డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తమై రాజీవ్ రహదారి పక్కన బస్సును నిలిపివేశాడు. బస్సులో ఉన్నవారిని అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు హుటాహుటిన కిందికి దిగారు.
బస్సులో ఉన్న అగ్నిమాపక పరికరాన్ని ఉపయోగించి మం టలు ఆర్పేందుకు డ్రైవర్ యత్నించినా.. అదుపులోకి రాలేదు. పరిస్థితి చేయి దాటిపోతుంద ని భావించిన డ్రైవర్ ప్రయాణికుల లగేజీ బ యటకు విసిరి దిగాడు. మంటలు చెలరేగగా.. అర గంటలోనే బస్సు మొత్తం కాలి బూడిదైపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే భారీ ప్రాణనష్టం వాటిల్లేదని ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం అందిన 40 నిమిషాల తర్వాత ఫైర్ ఇంజిన్ రావడంతో అప్పటికే బ స్సు మొత్తం దగ్ధమైంది. ఘటనాస్థలాన్ని పోలీ స్, అగ్నిమాపక, రవాణా, ఆర్టీసీ శాఖల అధికారులు సందర్శించారు. బస్సు బ్యాటరీలు పేలాయా? షార్ట్సర్క్యూట్ జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.