Viral News | ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 5 : కోతులకు భయపడ్డ ఓ వృద్ధురాలు చేసేదేమీలేక చేదబావిలో దుంకింది. తర్వాత కాపాడాలంటూ అరవడంతో స్థానిక యువకులు స్పందించి వెంటనే బావిలోకి తాడు వేసి కాపాడారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మం డలం బొప్పాపూర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గంభీర్పూర్ రాజవ్వ అనే వృద్ధురాలు పెన్షన్ డబ్బులతో జీవనం కొనసాగిస్తూ ఇంట్లో ఒంటిరిగా ఉంటున్నది.
శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వను కోతుల మంద తరమడంతో ఏం చేయాలో తోచని ఆమె అక్కడే ఉన్న బావిలోకి దూకింది. బావిలో నీళ్ల వరకు వెళ్లి పక్కన ఉన్న రాయిపై నిలబడి రక్షించాలని కేకలు వేసింది. అక్కడే ఉన్న ఓ యువకుడు తాడు తీసుకుని బావిలోకి దిగి వృద్ధురాలి నడుముకు కట్టాడు. తర్వాత స్థానికుల సాయంతో ఆమెను పైకి తీసుకువచ్చారు. వెంటనే స్థానిక వైద్యుడితో చికిత్స అందించారు. వృద్ధురాలు ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు