హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి అదనంగా మరో 4 లక్షల మందికి ఈ సాయం అందించనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. ఈ మేరకు ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత ఇండ్ల నిర్మాణ పథకానికి, బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్(బీఏసీ) సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం చేసేందుకు బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రం ఏర్పడ్డాక గృహ నిర్మాణానికి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సొంత ఇల్లు కట్టుకోవాలనుకొనే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్కు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజ్ఞప్తిచేశారు. దళితబంధు పథకాన్ని ప్రకటించిన సమయంలోనూ ఈ విషయంపై ముఖ్యమంత్రికి పలుసార్లు వినతులు వచ్చాయి. డబుల్ బెడ్రూం స్కీంను ప్రారంభించిన తొలినాళ్లలోనూ ప్రజావాణికి, ఎమ్మెల్యేలకు లక్షల కొద్దీ దరఖాస్తులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం, గతేడాది బడ్జెట్లోనే సొంత జాగ ఉన్నవారికి ఇల్లు కట్టుకొనేందుకు సాయం చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది బడ్జెట్లో సొంత జాగ కలిగి ఇల్లు కట్టుకోవాలనుకొనే వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది.
ఈ ఆర్థిక సాయం పొందాలంటే ఎంత స్థలం ఉండాలి? డబుల్ బెడ్రూం కాకుండా ఇష్టం వచ్చిన ప్లాన్లో ఇల్లు కట్టుకోవచ్చా? లేక రాష్ట్ర ప్రభుత్వమే ప్లాన్ ఇస్తుందా? అనే అంశాలపై పూర్తిస్థాయి మార్గదర్శకాలు రూపొందించాక, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని గృహ నిర్మాణశాఖ పేర్కొన్నది.