న్యూఢిల్లీ: మహిళలకు 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విరుచుకుపడ్డారు. లోక్సభ, రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందచేయగల ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకున్నాయని మండిపడ్డారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును తిరస్కరించి, దానికి సంబరాలు జరుపుకోవడం, దానిపై విజయ నినాదాలు చేయడం ఖండించాల్సిన విషయం అని ఆయన ఆక్షేపించారు. ‘ఈరోజు లోక్సభలో చాలా విచిత్రమైన దృశ్యం కనిపించింది.
కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు నారీ శక్తి వందన్ అధినియం అనే కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నాయి. ఇప్పుడు దేశానికి చెందిన మహిళలకు తమ హక్కు అయిన 33 శాతం రిజర్వేషన్లు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో లభించవు. ఇది కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మొదటిసారి చేసిన పని కాదు. పదేపదే చేశాయి. వాటి ఆలోచనా విధానం మహిళలు గానీ దేశ ప్రయోజనాలపై గానీ లేదు అని అమిత్ షా విమర్శించారు. నారీ శక్తికి జరిగిన అవమానం పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఆ పార్టీలను ఆయన హెచ్చరించారు.