Amit Shah | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన మరోసారి రద్దయింది. ఈ నెల 29న తలపెట్టిన హైదరాబాద్ పర్యటనను అమిత్షా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది అమిత్షా పర్యటన రద్దు కావడం ఇది నాలుగోసారి. తెలంగాణ పర్యటనకు తేదీలు ఖరారు చేయడం, చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం అమిత్ షాకు పరిపాటిగా మారింది. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా అమిత్షా జనవరి 28, 29 తేదీల్లో తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా, తొలు త దానిని ఫిబ్రవరి 11కి వాయిదా వేసి ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం, సభ పెడితే పరువు పోతుందనే భయంతోనే ఇలా చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఆ తర్వాత మే 27న సమావేశానికి రావాల్సి ఉండగా అదీ రద్దయ్యింది. గత నెలలో ఖమ్మంలో లక్ష మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని విస్తృతంగా ప్రచారం చేసినా, రెండు రోజుల ముందు రద్దయ్యింది. ఈ నెల 29న అమిత్షా హైదరాబాద్కు వస్తారని ప్రచారం చేసి.. రెండు రోజుల ముందు మళ్లీ ‘రద్దు’ వార్త వెలువడింది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అమిత్షా తలపెట్టిన తొలిపర్యటన ఇది. చివరి నిమిషంలో రద్దు కావడంతో కిషన్రెడ్డి ఫీలవుతున్నట్టు తెలిసింది. కానీ అమిత్షా పర్యటన రద్దుతో ఏమిచేయాలో తెలియక కిషన్రెడ్డి తలపట్టుకున్నట్టు సమాచారం.