హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మైనర్ ఇరిగేషన్, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్తోపాటు బీడీ ఆకులపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్ నుంచి మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 46 వేల జలవనరులు ఉన్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. వీటి నిర్వహణ, మరమ్మతులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పేదల సంక్షేమానికి ఉద్దేశించిన పీడీఎస్ సంబంధిత కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సేవలపై జీఎస్టీ విధించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నదని, వీటికి కూడా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా మహిళలకు ఉపాధి చూపిస్తున్న బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
మహిళల ఉపాధికి దెబ్బ
ఇప్పటికే కేంద్రం బీడీలపై 28% జీఎస్టీ విధిస్తున్నదని, గతంలో దీనిని వ్యతిరేకించామని హరీశ్రావు గుర్తుచేశారు. ఇప్పుడు.. బీడీ ముడిసరుకైన తునికి ఆకులపై కూడా 18% జీఎస్టీ విధించడం సరికాదని చెప్పారు. దీనివల్ల పేదల, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, అందుకే మినహాయింపు ఇవ్వాలని కోరారు. ట్యాక్స్ ఇన్వాయిస్ రూల్స్ సవరణ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఉన్న సందేహాలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా టెలికం సేవలకు సంబంధించి కస్టమర్ అడ్రస్.. పేటీఎం, మొబిక్విక్, బిల్డెస్ తదితర ఆన్లైన్ వ్యాపార సంస్థల వద్ద ఉండే అవకాశం లేదని, దీంతో తమ పరిధిలో వినియోగదారులు ఉన్న రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం మరో రాష్ర్టానికి వెళ్తున్నదని దీనిని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులపై పూర్తి పరిశీలన నిమిత్తం ఫిట్మెంట్ కమిటీకి సిఫార్సు చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ ఇన్వాయిస్ రూల్స్ సవరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిషరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూప్రసాద్, వాణిజ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
హరీశ్తో ఆయుష్శాఖ కార్యదర్శి భేటీ
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుతో కేంద్ర ఆయుష్శాఖ కార్యదర్శి రాజేశ్ కొటేచా భేటీ అయ్యారు. శనివారం బీఆర్కే భవన్లో హరీశ్రావును కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆయుష్ కార్యక్రమాలపై రాజేశ్ కొటేచాకు హరీశ్ రావు వివరించారు. అనంతరం రాజేశ్ కోటేచాను మంత్రి సన్మానించారు.
ఇప్పటికే కేంద్రం బీడీలపై 28% జీఎస్టీ విధిస్తున్నది. గతంలో దీనిని వ్యతిరేకించాం. ఇప్పుడు.. బీడీ ముడిసరుకైన తునికి ఆకులపై కూడా 18% జీఎస్టీ విధించడం సరికాదు. దీనివల్ల పేదల, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అందుకే జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి.
-జీఎస్టీ కౌన్సిల్లో హరీశ్రావు