హైదరాబాద్, మార్చి30 (నమస్తే తెలంగాణ): నాడు అంబేద్కర్ కృషి ఫలితంగానే నేడు ఆర్బీఐ స్థిరత్వాన్ని సంతరించుకున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ తయారు చేయించిన అంబేద్కర్ ఆర్బీఐ చరిత్ర వాల్ పోస్టర్, కరపత్రాలను ఆర్ కృష్ణయ్య శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ‘బ్రిటీష్ పాలనలో మన కరెన్సీకి ఓ రూపం ఉండాలని, అది స్థిరంగా కొనసాగాలని అంబేద్కర్ భావించి ఓ పుస్తకాన్ని రచించారు. తర్వాత ఈ పుస్తకం ఆధారంగా చట్టం రూపుదాల్చింది. దాని ప్రకారం ఆర్బీఐ ఏర్పాటైంది. ఇలా ఆర్బీఐ ఏర్పాటు వెనుక అంబేద్కర్ కృషి ఎంతో ఉన్నది. కానీ ఆయన కృషిని ఆర్బీఐ మరిచిపోవడం దురదృష్టకరం. ఏప్రిల్ 1న నిర్వహించనున్న ఆర్బీఐ 89వ వార్షికోత్సవంలో అంబేద్కర్ ఫొటోను పెట్టి గౌరవించాలని ఆర్బీఐను కోరుతున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నందగోపాల్, సుధాకర్, వేముల రామకృష్ణ, రాజ్కుమార్, పృథ్వీగౌడ్, నిఖిల్ కృష్ణమూర్తి, బూడిద మధు, తాడెం అనిల్, కొమ్ము కృష్ణ తదితరులు పాల్గొన్నారు.