పెద్దపల్లి : రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రజలకు వివరించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి సభ్యులతో నృత్య రూపకం ద్వారా అంబేద్కర్ జీవిత విశేషాలను వివరించనున్నారు.
‘సంఘం శరణం గచ్చామి ’ పేరుతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వ తేదీ వరకు ధర్మపురి నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న గ్రామాల్లో నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నృత్య రూపకానికి సంబంధించిన ప్రదర్శనల కరపత్రాలు, పోస్టర్ ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరూ అభిమానించే వారిలో డాక్టర్ అంబేద్కర్ ముందు వరుసలో ఉంటారని అన్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆశయాలు, లక్ష్యాలను అందరూ తెలుసుకోవాలని, ప్రతీ ఒక్కరూ కులమతాలకతీతంగా నృత్యనాటక ప్రదర్శనను తిలకించాలని కోరారు.