Prakash Ambedkar | ఎదులాపురం, జూన్ 6: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అంబేద్కర్ మనుమడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ముందుగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు, నూతనంగా ని ర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని బీజేపీ నెరవేర్చలేదని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన, పోరాటాలు చేసిన వారిపై మోదీ, అమిత్షా.. ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వారు చె ప్పినట్టు వినకపోతే తీహార్ జైలుకు పంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వారికి తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా కలిసి బీజేపీని ఓడించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.