మాదాపూర్, ఏప్రిల్ 4: గుండె వైద్య చికిత్సలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. గుండెకు సంబంధించిన నాలుగు కవాటాల్లో మూడింటిని మెకానికల్ వాల్వులతో మార్చే చికిత్సను విజయవంతంగా నిర్వహించారు కిమ్స్ వైద్యులు. ఈ చికిత్సకు గతంలో టిష్యూ వాల్వులను ఉపయోగించేవారని, ఇప్పుడు మెకానికల్ వాల్వులతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని కిమ్స్ చీఫ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ నిసర్గ బృందం తెలిపింది.
మియాపూర్కు చెం దిన మీనా (25) విపరీతంగా ఆయాసపడుతూ నాలుగు అడుగులు కూడా నడవలేకపోయేది. కొండాపూర్ కిమ్స్ దవాఖానలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గుండెలోని మూడు ప్రధాన కవాటాలు మైట్రల్, ట్రైకుస్పిడ్, అయోటిక్ వాల్వులలో లీకేజీ ఉన్నట్టు గుర్తించారు. ఆమెకు 16 ఏండ్ల వయస్సులో ఒకసారి మైట్రల్ వాల్వ్ మార్చారు. అప్పట్లో టిష్యూ వాల్వును అమర్చారు. దీంతో ఆమెకు శస్త్రచికిత్స చేయాలని నిసర్గ బృందం నిర్ణయించింది. తొమ్మిది గంటలపాటు ఆపరేషన్ చేసి ఈసారి మెకానికల్ వాల్వులతో మైట్రల్, ట్రైకుస్పిడ్, అయోటిక్ కవాటాలను మార్చారు. ఆపరేషన్ జరిగిన రెండోరోజే ఆమె నడవడం ప్రారంభించారని వైద్యులు తెలిపారు.