కామారెడ్డి : రాష్ట్రంలోని పేదలందరికీ నాణ్యమైన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ ఏడాది విద్యారంగానికి రూ.19,093 కోట్లను కేటాయించిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam Srinivas Rddy) వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల(Decade Celebrations)లో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో తెలంగాణ విద్యాదినోత్సవాన్ని (Education Day) నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చదువుతో మనిషికి జ్ఞానం కలుగుతుంది. మంచి చెడులు తెలుస్తాయి. మంచి నడవడిక అలవాటవుతాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 26,065 విద్యాలయాలు ఉండగా వీటిలో 26 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారని వెల్లడించారు.రాష్ట్రంలో 1002 గురుకులాలు ఉండగా వీటిలో 5.59 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వివరించారు. గురుకులాల బడ్జెట్ రూ.784 కోట్ల నుంచి రూ.3,400 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు.
ప్రజాప్రతినిధులు విద్యాలయాలను నిత్యం సందర్శించినపుడే నాణ్యత పెరుగుతుందని చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమర్ధతతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. చదువుకున్న యువతకు ప్రైవేటు రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. జూన్ 26 నుంచి వానాకాలం రైతుబంధు నిధులు రైతులకు అందనున్నాయని స్పీకర్ పేర్కొన్నారు.
రేపటి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల
బుధవారం ఉదయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామని పోచారం వెల్లడించారు.అవసరమైతే కొండపోచమ్మ సాగర్ నుంచి 5 టీఎంసీ(TMC )ల గోదావరి నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారని చెఆప్పరు.వానాకాలం పంటల సాగుకు డోకా లేదన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో రూ.1.61 కోట్లతో నూతనంగా అభివృద్ధి చేసిన మౌలిక వసతులు, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.