Nallagonda | నిడమనూరు, జనవరి 30: కాంగ్రెస్ నాయకుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామం లో ఇటీవల విష జ్వరాలు ప్రబలగా.. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆశా వర్కర్ సంకూరి వెంకటలక్ష్మి తనను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంకతి సత్యం మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బ్లేడుతో ఎడమ చేతిపై కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అధికారులు వెంటనే ఆమెను పక్కకు తీసుకెళ్లి ప్రైవేటు వైద్యుడిని రప్పించి చికిత్స అందించారు. విధి నిర్వహణ విషయంలో జిల్లా ఉన్నతాధికారులకు కాంగ్రెస్ నాయకుడు తరుచూ ఫిర్యాదు చేస్తున్నట్టు వెంకటలక్ష్మి తెలిపింది. వ్యక్తిగత కక్షతో తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తుండటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆమె పేర్కొంది.
ఎమ్మెల్యే అక్కడే ఉన్నా కనీసం పట్టించుకోలేదని, ఏమైందని అడుగలేదని వాపోయింది. ఈ విషయమై కాంగ్రెస్ నాయకుడు సత్యం స్పందిస్తూ గ్రామంలో విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు పలు సూచనలు చేశామని, వ్యక్తిగతంగా తాను ఎవరిపైనా ఫిర్యాదులు చేయలేదని అన్నారు. ఆశ వర్కర్ వెంకటలక్ష్మిని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనోధైర్యంతో ఉండాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.