హైదరాబాద్, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదికలో బీసీలు 56.33 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ముస్లింలు 10.45 శాతం ఉన్నారని, బీసీల్లో అత్యధికులు వారేనని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే వ్యూహాత్మకంగానే బీసీల్లో అతిపెద్ద సామాజిక వర్గంగా ముస్లింలను ప్రకటించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 42 శాతం రిజర్వేషన్ల నాటకం బెడిసికొట్టి బీసీల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లిం ఓటర్లను తమ వైపునకు ఆకర్షించే వ్యూహంతోనే బీసీ కులగణన నివేదిక రూపొందించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
బీసీలకు 42 శాతం ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను పెంచకపోగా, ఉన్న కోటాలోనే కొంత భాగాన్ని ముస్లిం సామాజిక వర్గానికి పంచి ఇచ్చే పరిస్థితులను సృష్టిస్తున్నదని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కులగణన ప్రకారం రాష్ట్రస్థాయి సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ప్రధాన వాటా బీసీ ముస్లింలకే దక్కుతాయని చెప్తున్నారు. ఇది గౌడ, యాదవ, మున్నూరుకాపు, పద్మశాలీ తదితర వృత్తికులాల హక్కులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సామాజికవర్గాన్ని బీసీలుగా నిర్ధారించడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలు పాటించిందో నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
ప్రామాణికత లేకుండా బీసీ జాబితాలోకి
వాస్తవానికి ముస్లింలు ఏకరీతి సమాజం కాదని నిపుణులు చెప్తున్నారు. హిందువుల్లో ఉన్నట్టే ముస్లిం సామాజికవర్గంలోనూ స్పష్టమైన కుల వ్యవస్థ ఉన్నదని పేర్కొన్నారు. ఆష్రఫ్ (ఆధిపత్య కులాలు), అజ్లఫ్ (వెనుకబడిన ముస్లింలు), అర్జల్ (దళిత ముస్లింలు) అనే మూడు వర్గాలుగా ఉన్నారని చెప్తున్నారు. వెనుకబడిన వర్గంలో మదారి, నల్బంద్, సుర్జాపురి, అన్సారీ, మాలిక్ తదితర ఉపకులాలు ఉన్నట్టు చెప్పారు. మొత్తంగా 25 ఉపకులాలు ఉన్నాయని సమాచారం. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలందరినీ ఒకే వర్గంగా చిత్రీకరించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిని బీసీల కింద ఎలా చేర్చారనే దానికి ప్రభుత్వం వద్ద శాస్త్రీయ ఆధారం లేదని చెప్తున్నారు. ఈ నిర్ణయం బీసీలను దెబ్బతీయడంతోపాటు వారిలోని నిజంగా అవసరమైన, వెనుకబడిన కులాలకు లక్షిత ప్రయోజనాలు అందకుండా చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓబీసీ జాబితాలో ముస్లింల సంఖ్యను పెంచడం, ఆర్థిక ఉన్నతికి కీలకమైన ముందడుగుగా కాంగ్రెస్ చెప్పుకొంటున్నది. దీన్ని బెంగాల్, తమిళనాడులో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అక్కడి ముస్లిం ఓటర్లను ఆకర్షించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్లాన్ అని అనుమానిస్తున్నారు.
స్వామి కార్యం.. స్వకార్యం పూర్తయ్యేలా!
సాధారణంగా ప్రతి పదేండ్లకూ 13.5 శాతం జనాభా పెరుగుతుందని అంచనా. అయితే.. సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కులగణన నివేదికలో హిందూ బీసీల సంఖ్య దాదాపు 21 లక్షల వరకు తగ్గింది. అంటే 5 శాతం పడిపోయింది. జనాభా పెరుగాల్సిన చోట.. బీసీ జనాభా తగ్గడం వెనుక పాలకపక్షం వ్యూహం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. జనాభాను ఎంత పెంచి చూపిస్తే, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలనే డి మాండ్లు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించినట్టు చెప్తున్నారు. అందుకే బీసీ కులాల జనాభాను తగ్గించిందని, తకువ చూపితే తిరుగుబాటు వస్తుందనే ఆలోచనతో ముస్లిం బీసీల సంఖ్యను పెంచి బీసీ వర్గంలో చేర్చినట్టు చర్చ జరుగుతున్నది. తద్వారా స్వామి కార్యం.. స్వకార్యం నెరవేరినట్టు.. ఓవైపు బీసీల జనాభా 56.33 శాతానికి పెరుగగా, మరోవైపు ముస్లిం ఓటుబ్యాంకును తమ వైపు తిప్పుకొనే అవకాశం ఏర్పడిందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం.