హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలతో గోదావరి రివర్ బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, మిడ్మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకున్నాయి. ఎగువ నుంచి ఇప్పటికీ స్వల్ప వరద కొనసాగుతున్నది. నిజాంసాగర్తోపాటు పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తున్నారు. ప్రాణాహిత నుంచి వరద ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా లక్ష్మీ బరాజ్ గేట్లను ఎత్తారు. ఇక భద్రాచలం గోదావరి ఉగ్రరూపం దాల్చగా, అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి
వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రానికి సైతం ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చింది. పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి ఆయా ప్రాజెక్టులు ఇప్పటికే చేరువకావడంతో గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 66 వేల క్యూసెక్కుల వరద రాగా, శనివారం సాయంత్రానికి అది 1.83 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నది. నాగార్జునసాగర్కు వరద నామమాత్రంగా కొనసాగుతున్నది. ఇక నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.