హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పర్వదినాన ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కారు కానుకను అందించింది. ఉపాధ్యాయులు ఏడేండ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్న బదిలీలకు పచ్చజెండా ఊపింది. మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి ఆదివారం హైదరాబాద్లో పలు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యారు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఈ సందర్భంగా మంత్రులు ప్రకటించా రు. ప్రాథమిక సమాచారం మేరకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మంగళ, బుధవారాల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నది. మొత్తం ప్రక్రియ ఫిబ్రవరిలో పూర్తికానున్నది. బదిలీలు, పదోన్నతులు కల్పించినప్పటికీ ఆ యా ఉపాధ్యాయులంతా ఈ విద్యా సంవత్సరం ముగిసేవరకు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం ముగిసిన ఏప్రిల్ 24 తర్వాతే కొత్త స్థానాల్లో చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వ టీచర్లతోపాటు, మాడల్స్కూళ్లు, కేజీబీవీ టీచర్ల బదిలీలను సైతం చేపట్టనున్నారు.
ఈ ప్రక్రియను కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలన్నీ హర్షం వ్యక్తంచేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఇందుకు సహకరించిన మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశాయి. ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన భేటీలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు (పీఆర్టీయూటీఎస్), సదానందంగౌడ్, పర్వత్రెడ్డి (ఎస్టీయూ), ఎం చెన్నయ్య, మారెడ్డి అంజిరెడ్డి (పీఆర్టీయూ తెలంగాణ), జంగయ్య, చావ రవి (యూటీఎఫ్), జగదీశ్ (పండిత పరిషత్తు), రాజభాను చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డి (గెజిటెడ్ హెచ్ఎం), అశోక్కుమార్, రవీందర్ (టీపీటీఎఫ్), ఎండీ అబ్దుల్లా (ఆర్యూపీపీ), చక్రవర్తుల శ్రీనివాస్ (ఎస్ఎల్టీఏ) తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు.
ప్రక్రియ ఇలా..
తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడుతారు. దీంతో హెచ్ఎంల ఖాళీల సంఖ్య తేలుతుంది.
ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్స్(ఎస్ఏ)కు హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. దీంతో స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు ఖాళీ అవుతాయి.
ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్లకు(ఎస్జీటీ) స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు. ఆ వెంటనే వారికీ బదిలీలు చేపడుతారు.
రోజుకొక లేదా రెండురోజులకొక క్యాటగిరీవారీగా బదిలీలు, పదోన్నతులు చేపట్టేలా షెడ్యూల్ను రూపొందించి, వెబ్కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
బదిలీలు, పదోన్నతులు 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 23న అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. బదిలీ అయిన వారు ఏప్రిల్ 23న రిలీవ్ కావాల్సి ఉంటుంది.
సంక్రాంతి కానుక
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే షెడ్యూల్ విడుదలవుతుంది. పూర్తి పారదర్శకంగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రక్రియను చేపడుతాం.
– మంత్రి సబిత