నాందేడ్: బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతోపాటు సభస్థలికి వెళ్లే దారులన్నీ గులాబీ మయమయ్యాయి. ఎయిర్పోర్ట్ నుంచి సభావేది వరకు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ హోర్డింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సభావేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు గులాబీ కండువా కప్పుకోనున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు అవుతారని నాయకులు అంచానా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా నాందేడ్ జిల్లా సరిహద్దు తెలంగాణ నియోజకవర్గాలైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, జుక్కల్తో పాటు నిర్మల్, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు సభకు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.