మహేశ్వరం : సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల గ్రామాల రూపురేఖలు మారాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita IndraReddy) అన్నారు. గురువారం మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్, గట్టుపల్లి గ్రామాలలో రూ. 18 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా పల్లె ప్రగతితో నర్సరీలు, క్రీడా మైదానాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ల లాంటి సౌకర్యాలతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. దీంతో పాటుగా పూర్తి స్వచ్ఛ గ్రామాలుగా మారాయని పేర్కొన్నారు. ఇటీవల మహేశ్వరంలో పర్యటించిన సీఎం కేసీఆర్ ( CM KCR )మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గ్రామాలకు రూ. 15 లక్షల చొప్పున నిధులను ప్రకటించారని తెలిపారు. మెడికల్ కళాశాల, సబ్స్టేషన్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వివరించారు. మహేశ్వరం నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలకు అందిస్తామని అన్నారు. సొంత స్థలం ఉన్న వారికి రూ. 3 లక్షల ఆర్ధిక సహాయం అందించనున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడాలేవని అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ పథకాలు కావాలంటూ కోరుకుంటున్నారని వివరించారు. గట్టుపల్లి గ్రామంలో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంద్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.