రాయికల్(జగిత్యాల సభ నుంచి), డిసెంబర్ 7: సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎస్టీ, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని మోతె శివారులో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షత వహించారు. జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రజల వద్దకే పాలన తెచ్చి దేశ చిత్రపటంలో రాష్ర్టాన్ని నిలిపారని సీఎం కేసీఆర్ను కొనియాడారు. ఏండ్లుగా ఉన్న జగిత్యాల జిల్లా ఏర్పాటు కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాగా ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసి జిల్లావాసుల చిరకాల వాంఛను తీర్చారని పేర్కొన్నారు. జిల్లాపై సీఎం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
పాలన చేరువవుతుంది
ఒకప్పుడు సంస్థానంగా బండలింగాపూర్ ఒక వెలుగు వెలిగింది. సంస్థానం నుంచి గ్రామ పంచాయతీగా తర్వాత మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగుతున్నది. ఇబ్రహీంపట్నం మండలంలో గ్రామంగా కొనసాగింది. ప్రజల కోరికను ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మండలంగా ప్రకటింపజేయడం హర్షణీయం. పాలన మాకు మరింత చేరువవుతుంది. – నీలి గంగాధర్, రైతు, బండలిగాపూర్
యాదాద్రి తరహాలో అభివృద్ధి
ఎంతో విశిష్టత కలిగిన కొండగట్టు ఆలయానికి సీఎం కేసీఆర్ సారు రూ.100 కోట్లు ప్రకటించ డం సంతోషకరం. పెం డింగ్ పనులు పూర్తవుతాయి. ఆలయ రూపురేఖలు మారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. యాదాద్రి తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
– తిరుక్కోవెళూర్ మారుతీస్వామి, ఫౌండర్ట్రస్టీ, కొండగట్టు ఆలయ చైర్మన్
దేశ ప్రజలందరికీ మేలు
సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేసి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఇలాంటి ప్రజా నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. తెలంగాణ మాదిరిగానే దేశంలోని అన్ని రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయి.
– బండారి సురేశ్, అయోధ్య
(రాయికల్ మండలం)