Telangana Polls | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైన వేళ కారు టాప్గేర్లో దూసుకుపోతుండగా, ప్రతిపక్షాలు ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించాలన్న దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తున్నది. అగస్టు 21న సీఎం కేసీఆర్ 115 మంది జాబితాను ప్రకటించిన వెంటనే ఆ పార్టీ అభ్యర్థులంతా ప్రచారంలోకి దిగారు. దాదాపు 50 రోజులుగా క్యాడర్ మొత్తం కదం తొక్కుతున్నది. విజయం తమదే అన్న ధీమాతో ముందుకుసాగుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తదితరులు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కనీసం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. వామపక్షాలు, ఇతర చిన్నాచితకా పార్టీలు కనీసం సోదిలో కూడా లేవు.
షెడ్యూల్ వచ్చేనాటికి ప్రతిపక్షాలు కనీసం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కాంగ్రె స్, బీజేపీ అభ్యర్థుల జాబితాపై అదిగో, ఇదిగో అంటూ హడావుడి చేస్తున్నాయి. కాంగ్రెస్లో జరుగుతున్న ‘అతి’ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. టికెట్ల కోసం చాలా రోజుల క్రితమే దరఖాస్తుల హడావుడి మొదలుపెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నామంటూ ఢిల్లీలో కాలం కరగదీస్తున్నారు. టికెట్ల కోసం అంతర్గత కుమ్ములాటలు పెరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. టికెట్లను ఢిల్లీలో నిర్ణయించడం, టికెట్ల కోసం ఢిల్లీలో, గల్లీలో ధర్నాలు చేయడం చూసి ప్రజలు ‘వీళ్లు మారరు’ అని మండిపడుతున్నారు.
బీజేపీ పరిస్థితి మరీ ఘోరం. భూతద్దం పెట్టి వెతికినా ఆ పార్టీకి 119 స్థానాల్లో అభ్యర్థులే దొరకడం లేదు. కాంగ్రెస్ను కాపీ కొట్టి దరఖాస్తులు అంటూ హడావుడి చేసినా ఒనగూరిన ప్రయోజనం సున్నా. ఇప్పుడు ఆ పార్టీకి గరిష్ఠంగా 30 స్థానాలకే అభ్యర్థులు కనిపిస్తున్నారు. చేరికలు బంద్ కావడంతో కొత్తవాళ్లు వస్తారనే ఆశలేదు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇతర కేంద్రమంత్రులు ఇలా ఎంతమందిని తీసుకొచ్చి ప్రచారం చేయించినా ఫలితం కనిపించడం లేదు. రోజురోజుకూ ఓటుబ్యాంకు పడిపోతున్నదని ఆ పార్టీ అంతర్గత సర్వేల్లోనే తేలుతున్నది. దీంతో పోటీ చేయడానికి సీనియర్లు జంకుతున్నారు. ఎంపీలు, మాజీ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించినా ససేమిరా అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రావని భయపడుతున్నారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగలగడమే ఇప్పుడు బీజేపీకి పెద్ద టాస్క్గా మారింది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తొమ్మిదిన్నరేండ్ల పాలననే బీఆర్ఎస్ ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు ప్రజలకు అనుభవంలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ అంశాలనే ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తున్నారు. మిషన్భగీరథ, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, టీఎస్ఐపాస్, పారిశ్రామికాభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, కంపెనీలకు తెలంగాణ గమ్యస్థానంగా మారడం వంటి అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. మళ్లీ గెలిపిస్తే ఇంతకుమించిన అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని చెప్తున్నారు. తమ భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే సీఎం కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తల కోలాహలం మధ్య గ్రామగ్రామాన ప్రచారం జోరుగా సాగుతున్నది. అభ్యర్థులు ఇప్పటికే దాదాపు నియోజకవర్గం మొత్తం చుట్టివచ్చారు. అనేక గ్రామాల ప్రజలు తాము బీఆర్ఎస్ వెంటే ఉంటామని, సీఎం కేసీఆర్ అభివృద్ధికే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు.