హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అనేక సంఘాలు సంబురాలు జరుపుకున్నాయి. వీఆర్ఏ క్రమబద్ధీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలుపడంతో 23 వేల కుటుంబాల్లో సంతోషం నిండిందని హర్షం ప్రకటించాయి. కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్కు తమ కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటాయని ప్రకటించాయి.
రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు వివిధ సంఘాల ఆధ్వర్యంలో నాయకులు పాలాభిషేకాలు నిర్వహించారు. పటాకులు కాల్చి సంతోషం ప్రకటించారు. క్యాబినెట్ సమావేశంలో జీవో 111 ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య సంబురాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకున్నారు.
వీఆర్ఏ క్రమబద్ధీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలుపడాన్ని హర్షిస్తూ వీఆర్ఏ జేఏసీ నేతలు హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్, వీఆర్ఏ జేఏసీ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిని వీఆర్ఏ సంఘాల నాయకులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాల్లో జేఏసీ కో చైర్మన్ రమేశ్ బహదూర్, సెక్రటరీ జనరల్ దాదేమియా, కన్వీనర్ సాయన్న, కో కన్వీనర్లు పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. వీఆర్ఏలు పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొన్నారు. తాసీల్దార్ కార్యాలయాల వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.