జాతీయ సమరాంగణంలో దూకేందుకు సీఎం కేసీఆర్ చేసిన శంఖారావంతో దేశంలో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. జాతి జీవనంలో ఒక నూతన శకానికి ఆవిష్కారం జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు మొదలుకొని ప్రాంతీయ, జాతీయపార్టీల నేతల వరకు అందరూ కేసీఆర్ జాతీయ రాజకీయ రంగప్రవేశాన్ని హర్షామోదాలతో ఆహ్వానిస్తున్నారు. మత విద్వేష రాజకీయాలతో జాతిజీవనాన్ని కలుషితం చేస్తున్న బీజేపీ పాలనను బలంగా ఢీకొనే శక్తిసామర్థ్యాలున్న నేతగా ప్రశంసిస్తున్నారు. దేశంలో విచ్ఛిన్నకర విధానాల విద్వేష రాజకీయాలకు బదులుగా అభివృద్ధి, సంక్షేమాల పాలనకు సీఎం కేసీఆర్ నాయకత్వం బాటలు తీయగలదనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాధకుడు, అభివృద్ధి ప్రబోధకుడు జాతికి మార్గదర్శకుడు కావాలని ఉత్తరం, దక్షిణం అనే తేడాలు లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలు ముక్తకంఠంతో ఆకాంక్షిస్తున్నారు. గుజరాత్ మాడల్కు తెలంగాణ మాడలే సరైన సమాధానమని తీర్మానిస్తున్నారు. కేసీఆర్ లాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి రావాలని అంటున్నారు.
మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది. దేశంలో మతసామరస్యాన్ని కాలరాసింది. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. గతంలో గొప్పగా చెప్పుకున్న గుజరాత్ మాడల్ అన్ని రంగాల్లో ఫెయిలైంది. నీతిఆయోగ్ నివేదికను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు దేశ ప్రజలు గుజరాత్ మాడల్ను కాదు.. తెలంగాణ, కేరళ మాడల్ను చూస్తున్నారు.
– ప్రకాశ్ కారత్, సీపీఎం నేత
తెలంగాణ మాడల్ ప్రగతిశీలం. గుజరాత్ మాడల్ ద్వేషపూరితం. ప్రస్తుతం దేశానికి తెలంగాణ మాడల్ కావాలి. కేంద్రంలో బీజేపి సర్కార్ ఫెడరల్ స్ఫూరికి తూట్లు పొడుస్తున్నది. పలు ప్రజావ్యతిరేక విధానాలను వివిధ రాష్ర్టాలు విభేదించినా, కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తోన్న కృషిని ప్రశంసించక తప్పదు.
– రాజేంద్ర సింగ్, మధ్యప్రదేశ్ శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. దేశాభివృద్ధికి ఇలాంటి నేతలు ఎంతో అవసరం. జాతీయ రాజకీయాల్లోకి ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నా.
– శరద్ పవార్, ఎన్సీపీ చీఫ్
దూరదృష్టి కలిగిన పరిపక్వ రాజకీయ నేత కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నా అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కేసీఆర్ పాలనా దక్షతపై గతంలోనూ ఉద్ధవ్ ప్రశంసలు కురిపించారు.. ఆయన మాటల్లోనే.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మంచి అనుబంధం ఉన్నది. దేశానికి కొత్త దిశ చూపించేలా తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి పనిచేస్తాం. ప్రస్తుతం దేశంలో రాజకీయాల స్థాయి దిగజారిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే దేశం భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆందోళనకరంగా ఉన్నది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఎవరో ఒకరు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ నేపథ్యంలోనే మేమిద్దరం ముందుకొచ్చాం. మా ప్రయాణం కఠినమైనదని తెలుసు. అయినప్పటికీ, ఎంత కష్టమైనా ముందుకే వెళ్తాం. దేశంలో విధానపరమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఇదే సఖ్యతతో కలిసి పనిచేస్తాం. ప్రతీకార రాజకీయాలకు మేం పూర్తిగా వ్యతిరేకం. హిందూత్వం ఎప్పుడూ ప్రతీకారం కోరదు.
బీజేపీవి విభజన రాజకీయాలు. ఆ పార్టీ కారణంగా దేశ సమగ్రతకే ముప్పువాటిల్లే పరిస్థితి తలెత్తింది. బీజేపీ ముక్త్ భారత్ ఇప్పుడు అనివార్యం. దీని కోసం లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలి. ఈ ఏడాది మొదట్లో కేసీఆర్తో ఇదే అంశంపై చర్చించా. ఆయన దూరదృష్టి అద్భుతం.
– పినరాయి విజయన్, కేరళ సీఎం
దేశంలోని రాష్ర్టాల హక్కుల సాధన కోసం మేము నిరంతరాయంగా కృషిచేస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా తెలంగాణ హక్కుల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నారు. సమాఖ్య స్ఫూర్తితో పోరాడుతున్నారు.
-ఎంకే స్టాలిన్,తమిళనాడు సీఎం
దేశ రాజకీయ వ్యవస్థకు బీజేపీ ముప్పుగా మారింది. అన్ని రంగాల్లో దేశం అధోగతి పాలుకావడానికి మోదీ విధానాలే కారణం. బీజేపీని ఓడించడానికి భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసిరావాలి.
-డీ. రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి
ఉద్యమం ద్వారా రాష్ర్టాన్ని సాకారం చేసిన కేసీఆర్ అంటే నాకెంతో గౌరవం. ఆయన ఓ గొప్ప నేత. తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎన్నో అమలవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నా. కేసీఆర్పై గతంలోనే నితీశ్కుమార్ ప్రశంసలు కురిపించారు. ఆయన మాటల్లోనే.. కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడుపోసుకొన్న మిషన్ భగీరథ పథకం ఎంతో గొప్పది. గ్రామ గ్రామానికి మంచినీటిని అందించడం చాలా గొప్ప కార్యం. ప్రజా సంక్షేమం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ ఒక్కరికే సాధ్యమైంది.
-నితీశ్కుమార్, బీహార్ సీఎం
బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఆవశ్యకత ఇప్పుడు ఎంతో ఉన్నది. కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నా.
-అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత
యువతరానికి కేసీఆర్ ఆదర్శప్రాయుడని, జాతీయ రాజకీయాల్లోకి ఆయన రాకను స్వాగతిస్తున్నానని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్పై గతంలోనూ తేజస్వీ ప్రశంసలు కురిపించారు.. ఆయన మాటల్లోనే.. కేసీఆర్ పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించింది. రాష్ర్టాలు తెలంగాణ మాదిరిగా పరస్పరం కష్ట సుఖాలను కలిసి పంచుకున్నప్పుడే ఫెడరల్ వ్యవస్థ పరిఢవిల్లుతుంది. ఈ విషయంలో కేసీఆర్ తీసుకొంటున్న చొరవ స్ఫూర్తిదాయకం. ఇదేవిధంగా రాష్ర్టాలన్నీ పరస్పరం సహకరించుకొంటే దేశం అభివృద్ధి దిశగా పురోగమిస్తుంది. వెనుకబడిన రాష్ర్టాలకు కేంద్రం సహాయం అందించాల్సింది పోయి అణచివేస్తున్నది.
దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. దేశాభివృద్ధికి నవ్యపథం అవసరం. కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నా. సీఎంగా కేసీఆర్ విజయాలపై గతంలో కుమారస్వామి ప్రశంసలు కురిపించారు.. ఆయన మాటల్లోనే.. సీఎం కేసీఆర్ అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరం. తెలంగాణ సాధించిన అభివృద్ధిపై దేశమంతా చర్చిస్తున్నది. తమకూ ఈ అభివృద్ధి కావాలని దేశమంతా కోరుకొంటున్నది. తెలంగాణలో మాత్రమే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి.
– హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక మాజీ సీఎం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్రావు గారికి శుభాకాంక్షలు. తన పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఆయన చేతిలో ఇప్పటికే ఒక పెద్ద రాష్ట్రం తెలంగాణ ఉన్నది. ఇతర పార్టీలను కూడా కలుపుకొని జాతీయ పార్టీగా అవతరించగలదు. ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడడే నాయకుడు.
– సుబ్రమణ్యస్వామి, బీజేపీ నేత
కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తున్నది. ఈ పరిణామం మతోన్మాద, నియంతృత్వ విధానాలను ఎదుర్కొనే శక్తులకు మరింత బలం చేకూరుస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ గట్టిగా మాట్లాడుతున్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొనడం కాంగ్రెస్తో కాదు. మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో పోరాడలేకపోయింది. గుజరాత్ మాడల్ అంటే అరాచకం, మతోన్మాదం. గుజరాత్తో పోలిస్తే అభివృద్ధిలో దేశానికి తెలంగాణ మాడల్గా నిలుస్తున్నది. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. గుజరాత్ మాడల్ దేశాన్ని నాశనం చేసింది.
– సీపీఐ నేత కే నారాయణ
తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది. దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో కేసీఆర్ నడుం బిగించారు. మోదీ ప్రభుత్వం సామాన్యులను గాలికి వదిలేసింది. ఇటీవలి చరిత్రలో ప్రాంతీయ పార్టీని జాతీయపార్టీగా మార్చాలని ఎవరూ ప్రయత్నించలేదు. జనతాదళ్(యూ), సమాజ్వాదీ, ఆర్జేడీ, టీఎంసీ, ఎన్సీపీ వంటివి ప్రాంతీయ పరిధులు దాటి బైటకు రాలేదు. కేసీఆర్ సరైన మార్గంలో వెళ్తే, మోదీకి సవాల్గా మారే అవకాశముంది. మరీ గొప్పచేసి చెప్పడమో, పొగడటమో కాదుగానీ కేసీఆర్ అభివృద్ధి నమూనా మోదీ నమూనాకు పూర్తి భిన్నమైంది. వ్యవసాయం రంగంలో సంస్కరణలకు మోదీ తెచ్చిన బిల్లులు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. కానీ కేసీఆర్ రైతు విధానాలు ఎలాంటి సామాజిక ఆందోళనలకు దారితీయకపోవడం గమనార్హం. తెలంగాణలో పట్టుకోసం బీజేపీ తంటాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు భావనలు తలపడే అవకాశం ఉంది.
-అమితావ్ ముఖర్జీ, సీనియర్ పాత్రికేయుడు
కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయపార్టీలు సమాఖ్య లక్షణాలు కోల్పోవడం, అనేక ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొని రాజకీయ శూన్యత ఏర్పడింది. ఎనిమిదేండ్ల బీజేపీ పాలన, కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుండటంతో ఈ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఆ లోటును పూరించే అవకాశం ఉన్నది. అభివృద్ధి కాకుండా మతోన్మాద ఎజెండాను బీజేపీ అమలుచేస్తున్నది. తెలంగాణ వంటి రాష్ర్టాలు సమకూర్చే నిధులను బీజేపీ రాష్ర్టాల్లో ఖర్చు చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కు లేదు. రాజకీయ శూన్యాన్ని పూరించే ప్రగతిశీల, సమాఖ్యవాద, జాతీయ అభివృద్ధి ప్రణాళికతో పనిచేసే పార్టీ అవసరం. తగిన అర్హతలన్నీ కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్కు కోకొల్లలుగా ఉన్నాయి.
-జేఆర్ జానుంపల్లి, సీనియర్ పాత్రికేయుడు