నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్లడం చారిత్రక అవసరమని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ రాక కోసం యావత్తు దేశం చూస్తున్నదని తెలిపారు. శుక్రవారం నల్లగొండలో ఆయన మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మోదీకి ఆప్తమిత్రులుగా ఉన్న ఒకరిద్దరు బడా కార్పొరేట్ కంపెనీల అధిపతులే బాగుపడ్డారని ధ్వజమెత్తారు. నల్లధనం బయటకు తీసి పేదలకు పంచుతానన్న మోదీ, ఇంకా పెద్ద ఎత్తున నల్లధనం దాచుకొనేందుకే సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సామరస్యంతో జీవించాలనేదే టీఆర్ఎస్ అభిమతమని, ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ రాష్ట్రంలో దాన్ని ఆచరించి చూపారని తెలిపారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందని ఎద్దేవాచేశారు. ఈ పరిస్థితుల్లోనే దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఏర్పడిందని, అలాంటి శక్తి ఉన్న నేతగా కేసీఆర్ కనిపిస్తున్నారన్నారు.