హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పిస్తామని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్రాజ్ చెప్పారు. ఓటింగ్లో పాల్గొనేందుకు భారత ఎన్నికల సంఘం ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఇంటి వద్దనే కల్పిస్తామని, దాంతో ఇంటి వద్దే ఓటు వేసుకోవచ్చని వెల్లడించారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హౌస్నంబర్ ఆధారంగా పోలింగ్ స్టేషన్లను కేటాయిస్తామని చెప్పారు. ఓటర్ తుది జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందస్తుగా వృద్ధులు తప్పకుండా చెక్ చేసుకోవాలని సూచించారు.
మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రజలందరూ తమ ఓటు హకును వినియోగించుకోవాలని ఎన్నికల ఐకాన్ అమల కోరారు. పోలింగ్ రోజు తమ కుటుంబం మొత్తం మొదటి గంటలోనే వేస్తుందని గుర్తు చేశారు. వయో వృద్ధుల కోసం నగరవ్యాప్తంగా 115 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ చెప్పారు. ఈ సెంటర్ల ద్వారా వయోవృద్ధులు ఓటు నమోదుకు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రే, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, కంటోన్మెంట్ సీఈవో మధుకర్నాయక్, అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్రెడ్డి, స్వీప్ నోడల్ అధికారి అబ్దుల్ వకీల్, సీనియర్ సిటిజన్స్ అధికారులు పాల్గొన్నారు.