Agriculture University | రంగారెడ్డి : రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టుకు వర్సిటీ భూముల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పరీక్షకు వెళ్తున్న సెకండియర్ విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జీవో 55 రద్దు చేసేంత వరకు పరీక్షలు నిర్వహించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ సిబ్బందిని హెచ్చరించారు. ప్రొఫెసర్లను బయటికి పంపించిన విద్యార్థి సంఘాల నాయకులు.. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించడంతో గత కొద్ది రోజుల నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.