అడ్డగూడూరు, జనవరి 8 : కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాకే ప్రధాని మోదీ తెలంగాణకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీకి దమ్మూ, ధైర్యముంటే తెలంగాణలో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామ శివారులో రూ.11.25 కోట్లతో 15 వేల టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన అడ్డగూడూరు, మోత్కూరు మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంచు భూమి ఖాళీ లేకుండా సేద్యం అవుతున్నదని తెలిపారు.
దేశ రాజకీయ వ్యవస్థలో ప్రధాని మోదీ కంటే.. సీఎం కేసీఆర్ సీనియర్ అని పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్కు తెలంగాణ ఆత్మ లేదట. మీరంతా పరాయివాళ్లు.. కేసీఆర్ ఒక్కరే తెలంగాణ ఆత్మ అనేది ఒప్పుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. 50 ఏండ్లు ఆంధ్రా పాలకులు దోపిడీ చేశారని పేర్కొన్నారు. గత ఏడాది, ఈ ఏడాది వానకాలం పంటల సాగు లెక్కలు తీయగా ఆంధ్రాలో 38 లక్షల ఎకరాలు సాగు చేస్తే, తెలంగాణలో 68 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు తేలిందని అన్నారు. ఇది తెలంగాణ విజయం కాదా? అని ప్రశ్నించారు. దేశంలో మార్పు రావాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందని అన్నారు. భవిష్యత్లో ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయి దేశ రైతులకు ఉన్నదని తెలిపారు. భూమిని కాపాడి దేశ రైతును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని కేసీఆర్ చెప్తుంటే బీజేపీ నాయకులు రోజుకో పంచాయితీ పెడుతున్నారని మండిపడ్డారు.
మోదీ నాయకత్వంలో కొనసాగుతున్న రాక్షస పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంతోపాటు సూర్యాపేటలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 360 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. విద్యుత్తు కార్మిక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో 8ఏండ్లుగా వినూత్న రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పారు.
ఇలాంటి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పాలనను చూసి తట్టుకోలేక బీజేపీ విషం చిమ్ముతూ చీకట్లోకి నెట్టే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. 2014 ముందు సబ్స్టేషన్ల ముందు రైతులు ధర్నా చేసేవారని, ఇప్పుడు దేశంలో నిమిషం కూడా కరెంట్ పోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇతర రాష్ట్రాల మంత్రులు, ఢిల్లీ అధికారులు వచ్చి తెలంగాణ బాగా అభివృద్ధి జరిగినట్టు కితాబిస్తుంటే, ప్రధాని మోదీ జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఇతర రాష్ర్టాల ప్రజలకు బతుకుదెరువు కావాలంటే గుర్తొచ్చేది తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడే కాదు, అంతకు మించి పరిపాలనాధక్షుడు అని రుజువు చేశారని అన్నారు. నాడు తెలంగాణ కోసం సుమారు 14 ఏండ్లు సుదీర్ఘ పారాటం చేశామని, నేడు దేశ భవిష్యత్ కోసం అవసరమైతే మళ్లీ కేంద్రంపై పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంతోనే ఆంధ్రా ప్రాంతం అభివృద్ధి చెందనున్నదని అన్నా రు. ఆంధ్రా ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కిశోర్కుమార్, జడ్పీ చైర్మన్ ఏ సందీప్రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కే రామకృష్ణారెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పాల్గొన్నారు.