హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగా ణ): పంటలను కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారంలో మాత్రం పోటీ పడుతున్నాయి. పంటలను తాము కొంటున్నామంటే.. తామే కొంటున్నామంటూ ప్ర చారం చేసుకుంటున్నాయి. ఈ అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మధ్య లేఖల యుద్ధం మొదలైంది. ప్రతి పంటను కొనేందుకు అవసరమైన ప్రతి పైసా కేంద్రమే ఇస్తున్నదని, అయినప్పటికీ కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నదని బండి సంజయ్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం లేఖ ద్వారానే బండి సంజయ్కి సమాధానమిచ్చారు. కేంద్రం వదిలేస్తే రాష్ట్ర ప్రభుత్వమే పంటల ను కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఆర్థికంగా భారమైనప్పటికీ రైతుల కోసం కొ నుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఇలా పంట ల కొనుగోళ్లపై ఒకరిపై ఒకరు లేఖలతో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు ఎలా ఉన్నప్పటికీ వాటి రాజకీయంలో రైతులు సమిధలుగా మారుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మంత్రులు చెప్పే అంశాలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ఇప్పటివరకు కేవలం 11 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇక మక్కల కొనుగోళ్ల పరిస్థితి ఆగమాగం ఉన్నది. కేంద్రాలు లేకపోవడం, గన్నీ సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జొన్నల కొనుగోళ్లను ఇటు రాష్ట్రంగానీ, అటు కేంద్రంగానీ ప్రారంభించలేదు. శనగలను కేంద్రం వాటా వరకు కొనుగోలు చేసిన రాష్ట్రం.. మిగిలిన పంట కొనుగోలు చేయకుండా చేతులెత్తేసింది. పొద్దుతిరుగుడు రైతుల గోస అలాగే ఉన్నది. పంటల కొనుగోళ్లపై ఓ విధానం, చిత్తశుద్ధి లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రచారాలు చేసుకోవడం, రైతులకు తాము మేలు చేస్తున్నామంటే.. తాము మేలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.