దేశానికి 92 లక్షల టన్నుల ధాన్యమిచ్చాం: సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఒకనాడు బాధపడిన రైతు ఇవాళ దేశానికే ఆదర్శంగా మారాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలో సీఎం మాట్లాడుతూ..‘నిరంజన్రెడ్డి ఇవాళ వ్యవసాయశాఖ మంత్రి. ఒకనాడు వాళ్ల జిల్లాలో 85 వేల ఎకరాలకు నీరందించే ఆర్డీఎస్ తూములను సమైక్య పాలకుల కనుసన్నల్లో ఆ నాటి రాయలసీమ ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పలగ్గొట్టారు. ఉద్యమం ప్రారంభమైన కొన్ని నెలలకే .. బహుశా 2002లో జోగులాంబ గద్వాల అమ్మవారికి దండంపెట్టి అక్కడి నుంచి ఆర్డీఎస్ వరకు పాదయాత్రచేసినం. ఆ కాలువ దుస్థితిచూసి కొన్నిచోట్ల కండ్లకు నీళ్లు కూడా వచ్చినయ్. దాని దుస్థితి.. అవ్వకు పట్ట దు.. అయ్యకు పట్టదు. ఎందుకంటే అది తెలంగాణ కాలువ కాబట్టి. కానీ ఇదే నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు, ఈ సంవత్సరం పండిన పంటలో 92 లక్షల టన్నుల ధాన్యాన్ని మనం ఎఫ్సీఐకి ఇచ్చినం.
వలసపోయిన రైతులందరూ వాపస్..
గడిచిన ఆరేండ్లలో వ్యవసాయంలో చాలా మంచి అద్భుతం జరిగింది. వలసపోయిన రైతులందరూ ఊళ్లకు వాపస్ వస్తున్నరు. పాత ఇండ్లు సదురుకుంటున్నరు. ఏమైనా కానీ మన ఊళ్ల మనకు ఇంత ఇండ్లు ఉండాల్నే అని మళ్ల అంత ఇటు మర్రిన్రు. అది ఒక అద్భుతమైనటువంటి మార్పు. తెలంగాణ తన పునాదిని తాను బలంగా తయారు చేసుకుంటుందనడానికి ఇది సంకేతం. ఓ రోజు ఇట్లనే కూర్చొంటే ఇద్దరు, ముగ్గురు మిత్రులు వచ్చి మాట్లాడుతుంటే సర్.. సాయంత్రంపూట పోతుంటే గొర్లు బాగా కనబడుతున్నయ్. మోటర్లకు అడ్డం వస్తున్నయ్.. మేం అక్కడి పిల్లలను అడిగినం. ఏంది బాబు ఇంతగనం గొర్లు ఉన్నయ్ మీ ఊరిలో అంటే.. ఇవి కేసీఆర్ గొర్లు అన్నరు. ఇంగ వాని పుణ్యం.. వాడు కేసీఆర్ గొర్రె అన్లేదు.. ఆడికి బతికిపోయిన.. రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ గొర్రెల పంపిణీ చేస్తున్నం. నేను సీఎం అయిన తరువాత రివ్యూచేస్తుంటే రోజూ సుమారు 16,500 గొర్రెలు దిగుమతి అవుతున్నయ్ మన తెలంగాణకు అని తెలిసింది. ఒక హైదరాబాద్కే 11వేల చిల్లర గొర్రెలు ప్రతిరోజూ వస్తయ్. నేను అన్న. ఇదేం దుస్థితే బాబు.. మనకు గొర్రెలు పెంచే యాదవులు చాలా దండిగ ఉన్నరు కదా. ఎంత ఉన్నది జనాభా అంటే 30 లక్షలు సర్ అన్నరు. మరి 30 లక్షల మంది యాదవులను పెట్టుకొని ఈ గొర్రెలు దిగుమతి చేసుకునుడంటే సిగ్గుపోతది మనది.. అంటే ఏం చేస్తాం సార్. అప్పుడు అడిగినోళ్లు లేరు. ఉమ్మడి రాష్ట్రంలో మన గతి గంతే ఉండే అన్నరు. అప్పటికప్పుడు డిజైన్ చేసి, నా సెక్రటరీ స్మితా సబర్వాల్ లీడ్ తీసుకొని ఢిల్లీ వెళ్లి రెండుసార్లు అధికారులతో మాట్లాడి. ఎన్సీడీసీ నుంచి డబ్బులు తెచ్చి రెండు విడతలుగా స్కీమ్ డిజైన్ చేసినం. మొదటి విడత అయిపోయింది. రెండోవిడత త్వరలోనే ప్రారంభించబోతున్నాం.
మిషన్ కాకతీయ నుంచి కాళేశ్వరం వరకు…
మనం మొదట టేకప్ చేసిన ప్రోగ్రాం మిషన్ కాకతీయ. ఇంతకు ముందే రామారావు చెప్తున్నడు మా దగ్గర ఆరు మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినయ్ అని. అది మిషన్ కాకతీయ పుణ్యమే. అంతకుముం దు పళ్లేలు, తాంబాలాల కన్న అధ్వానంగా అయిపోయి ఉండే మన చెరువులు. ఇవాళ ఎక్కడ చూసిన బ్రహ్మాండంగా ఉన్నాయ్. తెలంగాణ తనను తాను పునర్మించుకున్నది. అదెట్లున్న దంటే మిషన్ కాకతీయ నుంచి స్టార్ట్ అయ్యి కాళేశ్వరం దాక పోయినం.
కాళేశ్వరం గొప్పను ఇంగ్లిషోళ్లు గుర్తించిన్రు
సన్నాసులు ఎప్పుడూ సన్నాసులే.. అన్నీ అనుమానాలే.. కాళేశ్వరం అయితదంటవా.. ఒక ఆత్మనూన్యత భావంతోని, రాజకీయ అరాకిరి కోసం ఇది అయ్యేదా.. పోయేదా.. అని మాట్లాడిన్రు. బట్ ఇట్ ఈజ్ రియాలిటీ.. మన తెలుగు టీవీలు సక్కగ చూపిస్తలేవు కానీ వాడు ఎవడో ఇంగ్లీషోడు చూపిచ్చిండు మొన్న. లిప్టింగ్ ఏ రివర్ అని చూపిచ్చిండు. ఏ విధంగా చేశారు.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ అని చెప్పిన్రు. ఓ సారి ప్రధాని కూడా నాతో అంటే నేను ఆయనతోని పంచాయతీ పెట్టుకున్నా. ‘తెలంగాణ కోసం ఐదారువందల మీటర్లు నీళ్లు ఎత్తిపోయాల్సి ఉంటది కదా’ అని ఆయన అన్నడు. వెంటనే నేను ‘ఇదంతా తప్పుడు ప్రచారం సార్. మీకెవరు చెప్పిన్రు. మాకు 50 మీటర్ల లిప్టులో నీరు వచ్చేది ఉన్నది. 100 మీటర్లలో ఉన్నది. 200 మీటర్లలో కూడా ఉన్నదని చెప్పిన. ఇప్పుడు కూడా కొన్ని పేపర్లు ఇంత కరెంట్ ఖర్చు పెడుతరా? అని రాస్తూ మాయా మచ్చింద్రి చేస్తున్నయ్. అందుకే కోపానికి వచ్చి ఓ సారి అసెంబ్లీలోనే చెప్పిన. ‘ఏడు వేల కోట్లని ఒకడంటడు. మూడు వేల కోట్లని ఒకడంటడు. పదివేల కోైట్లెనా కడుతా.. 15 వేల కోైట్లెనా కడుతా. మా రైతుల ఇండ్లు బంగారు వాసం కావాలే. మా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలే’ అని.
అప్పర్ మానేరు అడుగును జీవితంలో చూడం
అప్పర్ మానేరు ప్రాజెక్టు నా కండ్ల ముందే గొప్పగా వెలుగొంది.. నా కండ్ల ముందే నాశనం అయ్యింది. నిమ్మపల్లి దగ్గర మూలవాగు మీద ప్రాజెక్టు కట్టాలని అప్పట్లో పెట్టిన్రు. అది అసలు ప్రాజెక్టే కాదు.. ఓ పెద్ద చెరువు. పారేది 900 ఎకరాలు. కానీ నిమ్మపల్లి ప్రాజెక్టు కడితే ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైనా ఎఫెక్ట్ అయితదా? అని ఉమ్మడి పాలకులు 25 ఏండ్లు దానిని పెండింగ్లో పెట్టిన్రు. ఎక్కడి మూలవాగు.. ఎక్కడి ధవళేశ్వరం? ఉద్యమ సమయంలో ఒకరోజు రాత్రి వరంగల్ నుంచి నిజామాబాద్ పోతుంటే.. శభాష్పల్లె అనే ఊరు దాటంగానే మూలవాగు ఉంటది, ఆ వాగు దాటుకుంటనే ఓ పాట రాశిన. ‘ముల్కిపాయె.. మూటపాయె.. మూలవాగు నీళ్లు పాయె’ అని రాశిన. ఇకమీద అప్పర్ మానేరు సజీవ జలభాండంగా మారుతది. కాళేశ్వరం జలాలు పారే సిద్దిపేట, కొంతభాగం మెదక్ జిల్లాలో పొలాలు పారిన తర్వాత మిగిలే పడవాటి నీళ్లు అప్పర్ మానేరకు వస్తయి. కాబట్టి అప్పర్మానేరు అడుగును జీవితంలో చూడం.
కొన్నే పెండింగ్
ఇంకొక రెండు, మూడు ప్రాజెక్టులే ఉన్నయ్. ఒకటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అక్కడ ఆన్ గోయింగ్ స్కీంలు కంప్లీట్ చేసుకున్నాం. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్ లిప్ట్లు కంప్లీట్ చేసి ఒక పది, పదిహేను లక్షల ఎకరాలు పచ్చబడగొట్టుకున్నాం. ఉమ్మడి మహబూబ్నగర్తోపాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా నీళ్లు రావాలంటే పాలమూరు కంప్లీట్ అయిపోయాలి. అప్పుడు పది, పదిహేను లక్షల ఎకరాలకు నీళ్లు వస్తయ్. దాంతో మొత్తం సుభిక్షం అయిపోతది. ఖమ్మంలో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు ఒకటి పెండింగ్లో ఉంది. కాళేశ్వరంలో కొన్ని లిప్ట్లు నిజామాబాద్ కావొచ్చు, ఇంకోకాడ కావొచ్చు.. అక్కడా ఇక్కడా చిన్నచిన్నవి పెండింగ్లో ఉన్నయ్. వాటిని పూర్తి చేసుకుంటాం.
తిండి పెడుతరా? నమస్తే పెట్టి పంపుతరా?
ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో మంత్రి కేటీఆర్పై పంచులు వేశారు. ఓ సందర్భంలో ‘ఎనుకముందు చూసుడేంది రాజన్న ఓ రాజన్న పాట తెలంగాణ ఉద్యమంలో మార్మోగింది. శాన సూపర్ హిట్ కదా’ అని ప్రశ్నించారు. అక్కడున్నవారు ‘అవును’ అని మెల్లిగా చెప్పడంతో ‘ఆకలైతుందా ఏంది? రామారావ్ అన్నం పెడుతన్నరా లేదా ఇట్లే తోలుతున్నరా’ అని మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు. ‘నాకు ఆడాడ మోసమైంది. నాలుగు కొట్టేదాక పనిచేయించుకున్నరు.. తర్వాత నమస్తే అన్నరు. అప్పట్ల వరంగల్ టౌన్ల అట్లే అయింది. వర్క్ స్పీడ్ల వాళ్లు మర్శిపోయిర్రు.. మేము మర్శిపోయినం. నాలుగైన తర్వాత నమస్తే సార్ అన్నరు. మేం కారెక్కిన తర్వాత మాకు గోకుతంది. ఏం జెయ్యాలి ఇగ. రఘునాథపురం దగ్గర యశ్వంతాపూర్ అనే ఒక వాగు దగ్గర ఒక గొల్లామె హోటల్ కనవడ్డది. పెరుగన్నం పెట్టింది. తిని ఒచ్చినం. పోయి అడుగుతే.. ముందుగాళ్ల చెప్తే ఒండిపెడుతుంటి కదా? అన్నది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
అమృత వర్షిణి కరీంనగర్
చాలారోజుల క్రితం.. నేను కరీంనగర్ పట్టణంలో మీడియామిత్రులతో చెప్పినా.. నేను కంటున్న కల ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఈ కరీంనగర్ జిల్లా సజీవ జలధారలతోని ఒక అమృత వర్షిణిలా ఉంటది అని. అర్థం కాలే పాపం వాళ్లకు.. ఎట్లా ఉంటది సార్. ఏం ఉంటది సార్ అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పినా, చూస్తే గానీ మీరు నమ్మరు రాబోయే రెండు, మూడేండ్లలో చూస్తరు అని కూడా చెప్పినా. నా మాట ప్రకారం ఇవాళ కరీంనగర్ అమృత వర్షిణి అయ్యింది. ఆ గోదావరిని ఎత్తి పోసుకొని మనకు ఉండే వర్షపాతం ప్లస్ గోదావరి లిప్ట్ అన్ని కలపుకుంటే ఇవాళ కరీంనగర్ ఒక సజీవ జలధారలా తయారైంది.
సంస్కరణలు అభినందనీయం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న సంస్కరణలు అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో సిరిసిల్లతో కలిపి ఇప్పటివరకు నాలుగు కలెక్టరేట్ భవనాలు ప్రారంభించామని.. వాటిని చూస్తుంటే కలా, నిజమా అన్నట్టు ఉందని చెప్పారు.
సోమేశ్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి