హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు నిరాశే మిగిలింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు గత బడ్జెట్లో రూ.1,674 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో రూ.1529 కోట్లు మాత్రమే కేటాయించారు. రూ.145 కో ట్ల కోత విధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించి, పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.
కులవృత్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు పాడిపశువులు, యాదవులకు గొర్రెలు-మేకల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేసింది. మత్స్యకారులకు సుమారు రూ.4,600 కోట్లతో టూవీలర్లు, ట్రే లు, సంచార మత్స్య విక్రయ వాహనాలను అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో అధికారంలోకి ఇచ్చినప్పటి నుంచి మత్స్యకారులకు, గొర్రెల పెంపకందారులకు, పాడి రైతులకు సబ్సిడీ పథకాలు నిలిచిపోయాయి. రెండున్నరేండ్లుగా సబ్సిడీ పథకాల కోసం ఎదురుచూసిన లబ్ధిదారులకు ఈ ఏడాది కూడా నిరాశే మిగిలింది.