Ponguleti Srinivas Reddy | భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తొలిసారిగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. అనుకున్నంత జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. వేలాది మంది సభకు వస్తారని అనుకున్న పొంగులేటి ఆశలపై కొత్తగూడెం ప్రజలు నీళ్లు చల్లారు. మరోవైపు సభా వేదికపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఫొటో లేకపోవడం తో ఆయన అభిమానులు గొడవకు దిగారు. అప్పటికప్పుడు ఫొటోను ఫ్లెక్సీపై అతికించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.
సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా ఉంటాయని ఎదురుచూసినా కొద్ది మందికే పరిమితమమైంది. వేదికపై ఉన్న వారికి శాలువాలు కప్పి సభను ముగించారు. సభ జరుగుతుండగానే చాలా మంది కార్యకర్తలు మధ్యలోనే ఇంటి ముఖం పట్టారు. సభకు ముందు కొత్తగూడెంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తుండగా సైడ్ ఇవ్వమన్నందుకు కేటీపీఎస్ కాంట్రాక్టు కార్మికుడిపై పొంగులేటి వర్గీయులు దాడి చేశారు. రెండు బైక్లు రౌండప్ చేసి చితకబాదారు. కేవలం రోడ్డు పైనుంచి జరగమని చెప్పినందుకు తనపై తీవ్రంగా దాడి చేశారని బాధితుడు లక్ష్మీదేవిపల్లి పోలీసులను ఆశ్రయించాడు.
సభ అనంతరం చుంచుపల్లి మండలం విద్యానగర్కాలనీలో క్యాంపు కార్యాలయాన్ని పొంగులేటి ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్లో మూడు గ్రూపులుగా ఉన్న నేతలు ఎవరికి వారే క్యాంపు కార్యాలయాలు పెట్టుకున్నారు. టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ, నాగా సీతారాములు, పోట్ల నాగేశ్వరరావు వేర్వేరుగా ఇప్పటికే కార్యాయాలను ప్రారంభించుకున్నారు. కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. పొంగులేటి చేరికతో అందరూ కలిసినట్లే ఉన్నా పార్టీ కార్యాలయాలు మాత్రం ఎవరికి వారే నడిపిస్తున్నారు. తాజాగా పొంగులేటి ప్రారంభించిన కార్యాలయంతో కొత్తగూడెంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాలుగో కార్యాలయమైంది. గ్రూపుల లొల్లితో కాంగ్రెస్ కార్యకర్తలు డోలాయమానంలో పడ్డారు. అసలు పోటీచేసే అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో ఎవరికి వారే తమకంటే తమకు సీటు అంటూ లెక్కలు వేసుకుంటున్నారు.