Harish Rao | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.. రాష్ట్రంలో కరువు వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ రాగానే ఆత్మహత్యలు మొదలయ్యాయని అన్నారు. ఇదేనా మీ పాలన అంటూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల బలవన్మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
100 రోజుల పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీశ్రావు తెలిపారు. కావాలంటే ఆత్మహత్య చేసుకున్న రైతన్నల పేర్లు, ఫోన్ నెంబర్లు, గ్రామాల పేర్లతో కూడిన వివరాలను కూడా అందజేస్తానని మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఉపాధి కోల్పోయి 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని.. పనిలేక సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మళ్లీ పాత కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయ్యిందని చెప్పారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాగే నేతన్నలు, చేనేత ఆత్మహత్యలు జరిగాయని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. రాష్ట్రంలో కరువు తెచ్చిందని ఎద్దేవా చేశారు.
ఇది కచ్చితంగా మీ ఫెయిల్యూర్
రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది.. రైతు ఆత్మహత్యలు మొదలైనయని.. కాంగ్రెస్ పాలన వచ్చింది నేత కార్మికుల బలవన్మరణాలు ప్రారంభమయ్యాయని హరీశ్రావు అన్నారు. ఇదేనీ మీ కాంగ్రెస్ పాలన అని నిలదీశారు. ఈనాడు కాంగ్రెస్ను నమ్ముకున్నందుకు రైతుల కుటుంబాలు, చేనేత కుటుంబాలు, ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఇది వంద రోజుల పాలనలో కాంగ్రెస్ సాధించుకున్న అప్రతిష్ట అని విమర్శించారు. ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ హయాంలో పచ్చటి పొలాలు.. కాంగ్రెస్ పాలనతో పొలాలకు మంటలు
పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని అన్నారని.. కానీ దానిపై అతీగతి లేదని హరీశ్ రావు అన్నారు. రైతు రుణమాఫీపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు. ఆసరా ఫించన్లు పెంచుతామని.. ఉన్న పెన్షన్లు సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే.. రేవంత్ రెడ్డి కరువు పెంచడంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశమంతా కరువు ఉందని చేతగాని మాటలు చెబుతూ.. రైతుల నోట్లో మట్టిగొడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో పచ్చటి పొలాలు కనిపిస్తే.. పదేండ్ల తర్వాత రైతులు తమ పంట పొలాల్లో మంటలు పెట్టుకునే పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
100 రోజుల్లోనే ఇవన్నీ ఏమైపోయాయి?
కేసీఆర్ వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెడితే.. రేవంత్ రెడ్డి శిథిలావస్థలోకి నెడుతున్నారని హరీశ్రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో తాగునీటికి, సాగునీటికి లోటులేని పరిస్థితులు ఉంటే.. రేవంత్ రెడ్డి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకు మిషన్ భగీరథ పథకాన్ని కేసీఆర్ తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి రాజ్యంలో ఖాళీ బిందెల ప్రదర్శన కనిపిస్తుందని అన్నారు. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఖమ్మం పట్టణంలో అయితే మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రతిరోజు ఇంటింటికీ తాగునీరు వచ్చిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఇవన్నీ ఏమైపోయాయని ప్రశ్నించారు. పక్కన కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కదా.. వాళ్లను అడిగి సాగు నీరు కాకపోయినా కనీసం తాగు నీరు అయినా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని నిలదీశారు.