KTR | అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీపై యూఎస్ అభియోగాలు నమోదయ్యాయి. కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడంతోపాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడని విమర్శించారు.
అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు ఎలా ఇచ్చారంటూ మండిపడ్డారు. తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని.. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత ? మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత? అంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.
గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్తో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. అదానీ, అనుబంధ సంస్థలు 20 సంవత్సరాల్లో రెండు బిలియన్ డాలర్ల లాభం పొం సోలార్ పవర్ ప్లాంట్ ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇవ్వ జూపినట్లుగా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అమెరికాతో పాటు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించారని అభియోగాలు మోపారు.
అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా కంపెనీ మూడు బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించినట్లుగా న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యూఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకుపైగా సేకరించినట్లుగా ఆరోపించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది.
అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు..
భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు..
అదానితో కాంగ్రెస్ – బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టంరామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ లో అదానీ వాటా ఎంతో!
ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా..… https://t.co/CxL4jEGNIk
— KTR (@KTRBRS) November 21, 2024