కరీంనగర్ : ఆగస్ట్ నుంచి కరీంనగర్ వైద్య కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని విత్తన శుద్ధి క్షేత్రంలో ప్రభుత్వం నిర్మించనున్న వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులకు మంత్రి మంగళవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లోని పేద విద్యార్థులకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం వరమని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల రెండు నెలల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని వెల్లడించారు.శాశ్వత భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చే భూమిపూజ చేపడుతామని వివరించారు. కరీంనగర్ లో రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నా నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్నామని తెలిపారు.
కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య శాఖ మంత్ని హరీశ్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. విత్తన శుద్ధి క్షేత్రంలో తాత్కాలిక భవన నిర్మాణానికి రూ. 7 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. మొత్తం నాలుగు గోదాంలతో పాటు 25 ఎకరాల స్థలాన్ని కోసం కేటాయించామన్నారు. వీటిలో తరగతి గదులు, లైబ్రరీ, అనాటమీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ ల్యాబ్, ఫిసియోలజీ ల్యాబ్, అడ్మిషన్ బ్లాక్ తాత్కాలిక భవన నిర్మాణ పనులు చేపట్టి ఆగస్టు నెలల్లో వంద మంది విద్యార్థులతో ప్రవేశాలు ప్రారంభించనున్నమని తెలిపారు.
శాశ్వత భవన నిర్మాణం ప్రస్తుతం టెండర్ దశలో ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, నగర మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జిల్లా కలెక్టర్ కర్ణన్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణీ హరి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, వైద్య కళాశాల ప్రిన్సిపల్, ప్రభుత్వ ఆసుపత్రి సూపింటెండెంట్, కార్పొరేటర్లు , కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు