హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు పూర్తయింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 2 స్థానాల్లో బీఎస్పీ, 15 స్థానాల్లో బీఆర్ఎస్ కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీఎస్పీ జాతీయ సెంట్రల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్, తెలంగాణ సెంట్రల్ కో-ఆర్డినేటర్ మంద ప్రభాకర్, పార్టీ నేతలు దయానందరావు, విజయ్ ఆర్య, కే ఈశ్వర్ తదితరులు ఇప్పటికే దశలవారీగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్, హైదరాబాద్ సీట్లను బీఎస్పీకి కేటాయించాలని నిర్ణయించినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు.
11 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పోటీచేయనున్న 15 స్థానాల్లో ఇప్పటికే 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆత్రం సక్కు, మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఖమ్మం నుంచి నామా , మహబూబాబాద్ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ వినోద్కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబ్నగర్ నుంచి మన్నే శ్రీనివాస్రెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి కడియం కావ్య, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ను బరిలో దింపుతున్నట్టు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.