Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంప్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తున్నది. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం.
ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు క్యాంప్కు చేరుకున్నారు. ఆ తర్వాత సంఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఓ వైద్యుడితో పాటు మరికొందరు వచ్చి తమపై దాడికి పాల్పడ్డట్లుగా విద్యార్థులు ఆరోపించారు. అయితే, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు. రిమ్స్లోకి చొరబడ్డ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.