ఆదిలాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ) : ‘ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ కోసం సహకరించేది లేదు. మా వివరాలు అందించేది లేదు. ఎలాంటి పత్రాలు రాసి ఇవ్వబోం.. తాతలకాలం నుంచి భూములు దున్నుకుంటూ బతుకుతున్నం. ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ కోసం బలవంతంగా భూములు గుంజుకుంటే ఊరుకోం’ అని ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలోని భూ నిర్వాసితులు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల బడా కంపెనీలకే ప్రయోజనం కలుగుతది తప్ప రైతులకు ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు ఉన్నోడికి సద్దికట్టి లేనోడి పొట్ట కొట్టవద్దని వేడుకున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణలో భాగంగా అధికారులు మంగళవారం గూడ పంచాయతీలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించారు. భూములో కోల్పోతున్న రైతుల నుంచి వివరాలు సేకరించే క్రమంలో అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ముందుగా భూముల ధర నిర్ణయించిన తర్వాత భూ సేకరణ ప్రక్రియ చేపట్టాలని తేల్చిచెప్పారు. ధర నిర్ణయం తమ చేతుల్లో లేదని కలెక్టర్, ఇతర అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి ఎకరాకు ఎంత ధర ఇవ్వాలో నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. అభ్యంతరాలుంటే చెప్పాలనగా రైతులు ససేమిరా అన్నారు.
ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణకు రైతులు సహకరించాలని అధికారులు కోరగా చాలమంది రైతులు తమ వివరాలు అందించేది లేదని, ఎలాంటి పత్రాలు రాసివ్వబోమంటూ సర్వేను బహిష్కరించారు. అధికారులు తమను ఒప్పించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. గతంలో కొందరు బడాబాబులు తమ తాతల వద్ద నుంచి ఎకరాకు రూ.30 వేల చొప్పున కొనుగోలు చేశారని, భూ సేకరణతో అలాంటి వారు లాభపడుతారని, తమకు ఎకరాకు రూ.50 లక్షలిచ్చినా వేరే చోట భూమి దొరికే అవకాశం లేదని, గతంలో భూముల సర్వే నిర్వహించిన అధికారులు కనీస సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఎకరాకు రూ.70 లక్షలు ఇవ్వడంతోపాటు ఇంటికో ఉద్యోగం కల్పించాలని, తమ ఉపాధి కోసం ఏడాదికి రూ.2 లక్షలు ఇస్తామని బాండ్ రాసివ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి భూములిచ్చే ప్రసక్తేలేదు. భోరజ్ మండలంలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ కారిడార్తో పెత్తందార్లకే ప్రయోజనం కలుగుతది. కొందరు కంపెనీల యజమానులు మా తాతల వద్ద ఎకరాకు రూ.30 వేల వరకు ఇచ్చి కొన్నరు. కారిడార్ భూ సేకరణలో వారికే లాభమైతది. దళిత రైతులు ఎక్కువగా భూములు నష్టపోతున్నరు. వారికి ఉపాధి లేకుండా పోతది. చనాక- కొరాట ప్రాజెక్టు ద్వారా రెండు, మూడు పంటలు సాగుచేసుకుందామని ఆశించినా ఇప్పుడు భూములు పోయే పరిస్థితి వచ్చింది. గతంలో పెత్తందార్లు దళితుల భూములు దోచుకున్నరు. ఇప్పుడు ఐటీ కారిడార్ పేరుతో కొల్లగొడుతున్నరు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకోసం స్థలం ఇక్కన్నే దొరికిందా?
ఇండస్ట్రియల్ కారిడార్ భూముల కోసం సర్వే చేశామని రెవెన్యూ అధికారులు చెప్పిండ్రు. సర్వే గురించి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరి ఎవరికి చెప్పి సర్వే చేసిండ్రు? సచిన్ అనే రైతు 15 ఎకరాలు పోతున్నాయంటున్నడు. భూమి పోతే ఆయన పరిస్థితేంది? మా తాతలు కష్టపడి సంపాదించిన భూములు దున్నుకుంటూ బతుకుతున్నం. భూమి పోతే భూమి రాని పరిస్థితి ఉన్నది. ఎకరాకు రూ.70 లక్షలతోపాటు వేరే చోట భూమి ఇవ్వాలె. భూములు కోల్పోతే రైతులకు ఏమీ మిగులదు. కంపెనీల్లో ఇంటికో ఉద్యోగం ఇవ్వాలె. అధికారులు వచ్చి ఎకరాకు ఎంత ధర ఇస్తారో చెప్పకుండా భూముల సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడుగుతున్నరు. ఫారాలు నింపి ఇవ్వుమని అడుగుతున్నరు. రైతులు ఇప్పటికే మోసపోయిండ్రు. ధర నిర్ణయించిన తర్వాతే భూముల సేకరణ చెయ్యాలె.