హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రకటించిన హరిత నిధి ఆలోచన ఎంతో గొప్పదని, తెలంగాణలో పచ్చదనం పెంపునకు ఇది ఎంతో దోహదపడుతుందని సినీ నటుడు జగపతిబాబు కొనియాడారు. శనివారం ఆయన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్కుమార్తో కలిసి దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో మొక్కలు నాటారు. ఆయన అటవీ అధికారిగా నటిస్తున్న సింబా చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఫారెస్ట్ అకాడమీలో జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రకృతిని కాపాడే విషయంలో ప్రతిఒక్కరి బాధ్యతను హరిత నిధి కార్యక్రమం పెంచుతుందన్నారు. ప్రకృతిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. అంతకుముందు ఫారెస్ట్ అకాడమీకి తొలిసారి వచ్చిన ఎంపీ సంతోష్కుమార్ను అకాడమీ డైరెక్టర్ పీవీ రాజారావు సత్కరించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అకాడమీ అధికారులు, ఉద్యోగులతో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో దర్శకుడు సంపత్ నంది, నిర్మాతలు రాజేందర్రెడ్డి, మురళీమనోహర్రెడ్డి, నటీనటులు శ్రీనాథ్ మాగంటి, దివ్య, కబీర్ దుహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.