Paddy | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. రైతుల నోటికాడి ముద్దను దూరం చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంటలను కాపాడే ప్రత్యామ్నాయ విధానాలపై చర్చ జరుగుతున్నది. వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించాయి. యాసంగిలో అకాల వర్షాల నుంచి పంటలను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై మేధోమథనం సాగించాయి. పలు అంశాలను గుర్తించి వీటిపై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యవసాయ శాస్త్రవేత్తలు సాగు సమస్యల పరిష్కారానికి రైతులకు పలు సూచనలు చేస్తున్నారు.
వరి సాగులో రైతులకు నాట్ల ప్రక్రియ ఇబ్బందికరంగా మారింది. కూలీలు దొరకక ఆలస్యమవుతున్నది. రైతులు నాట్లువేసే పద్ధతికి స్వస్తి పలికి వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తద్వారా పంట సాగు సమయంలో కనీసం 15 రోజులు తగ్గుతుందని అంటున్నారు. దీనివల్ల కూలీల కొరతను అధిగమించడంతోపాటు పెట్టుబడి కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
ఏటా ఏప్రిల్ రెండో వారం నుంచి చివరి వరకు వడగండ్లతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంటుంది. వర్షాలు రావడానికి ముందే వరి కోతలు పూర్తయ్యేలా సీజన్ను ప్లాన్ చేసుకోవాలి. యాసంగి సీజన్లో జనవరి నుంచి ఫిబ్రవరి చివరి దాకా రైతులు నాట్లు వేస్తున్నారు. ఈ విధానమే రైతులకు ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి సీజన్ను నెల రోజుల ముందే ప్రారంభించాలని సూచిస్తున్నారు. అంటే నవంబర్ 15 వరకు నార్లు పోసి.. డిసెంబర్ నెలాఖరు వరకు నాట్ల ప్రక్రియను పూర్తి చేయాలి. తద్వారా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో వరి కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏప్రిల్, మే నెలలో కురిసే వర్షాలతో రైతులకు ఇబ్బంది ఉండబోదని విశ్లేషిస్తున్నారు.
యాసంగిలో ఇబ్బందులను అధిగమించాలంటే తక్కువ కాలంలో వచ్చే పంట, చలికి తట్టుకునే వంగడాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యాసంగిలో రైతులు 135-145 రోజుల వ్యవధి గల వరి విత్తనాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో 125 రోజుల పంట సమయం గల వంగడాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో చలి తీవ్రంగా ఉన్నప్పుడు వరి పెరగదు.. కంకులు పెట్టదు. ఈ పరిస్థితులను తట్టుకునే వంగడాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.