హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే దానిపై రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ యాసంగిలో మొత్తంగా 33,46,013 ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించింది. ఆయా ప్రాజెక్టుల వారీగా త్వరలోనే నీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నిండుగా ప్రాజెక్టులు..
రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రతిపాదిక పూర్తి చేసి ఎస్సారెస్పీ ఆయకట్టుకు జవసత్వాలు కల్పించారు. అనేక రిజర్వాయర్లను నిర్మించడంతోపాటు, వాటిని చెరువులకు అనుసంధానం చేసి నీటితో నింపుతున్నారు. మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ వంటి భారీ ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. వీటికితోడు ఎల్లంపల్లి, మధ్యమానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ తదితర రిజర్వాయర్లు సైతం అందుబాటులోకి రావడంతో నీటి నిల్వసామర్థ్యం గణనీయంగా పెరిగింది. కుమ్రంభీం, నల్లవాగు, రామప్ప, లక్నవరం, సుద్ధవాగు, వట్టివాగు, నీల్వాయి, కౌలాస్నాలా వంటి 40కి పైగా మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి నీటి నిల్వ సామర్థ్యం సుమారు 65.22 టీఎంసీలు కాగా, ప్రస్తుతం వాటన్నింటిలో కలిపి 60 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉన్నది. ఇక చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీటితో తొణికిసలాడుతున్నాయి. దీంతో యాసంగిలో సాగుకు అవసరమైన నీరు పుష్కలంగా అందుబాటు ఉన్నది.
గతంలో ఆరుతడికి మాత్రమే..
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ ప్రాంతంలో యాసంగి సాగుకు 20లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందించిన దాఖలాల్లేవు. ప్రధాన ప్రాజెక్టుల కింద కొద్ది మొత్తంలో నీరు విడుదల చేసినా అవి నూనె గింజలు తదితర మెట్టపంటలకే సరిపోయేవి. కానీ గత మూడేండ్లుగా మేజర్, మీడియం ప్రాజెక్టుల కిందనే ఏటా దాదాపు 35 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అందులో 20 లక్షల ఎకరాలకు పైగా వరి, సోయాబిన్, మొక్కజొన్న తదితర పంటలకే సాగునీరు అందుతుండటం మరో విశేషం. ఆరుతడి పంటలకు సైతం సమృద్ధిగా సాగునీటిని అందిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆరుతడి పంటలకు తగ్గిస్తూ తరి పంటలకు సీగునీటి సరఫరాను పెంచాలని నిర్ణయించారు. 2021-22 యాసంగిలో దాదాపు 19.81లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని అందించగా, ఈ ఏడాది 13.84 లక్షల ఎకరాలకు తగ్గించారు. అదే సమయంలో గతేడాది యాసంగిలో కేవలం 11.95 లక్షల ఎకరాల తరి పంటలకు సాగునీటిని అందించగా, ఈ ఏడాది ఏకంగా 22.32 లక్షల ఎకరాలకు అందించలని నిర్ణయించారు.
నీటి విడుదలకు సన్నాహాలు..
రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు నీటిని విడుదల చేసేందుకు సాగునీటి పారుదలశాఖ సన్నద్ధమవుతున్నది. ప్రాజెక్టులవారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో అంటే 8 రోజులు ఆన్, 7 రోజుల ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయనుండగా, ఇప్పటికే ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా నీటి పొదుపుపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు.