ధర్మపురి : స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గత యేడాది వరదల వల్ల దెబ్బతిన్న ధర్మపురి మండలం రాజారం ఎత్తిపోతల పథకానికి (శివగంగ లిఫ్ట్) రూ.49.75లక్షలతో చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆదివారం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ భవిష్యత్ అవసరాల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులను పునరుద్ధరించామన్నారు. ధర్మపురి నియోజవర్గంలో గోదావరి ఒడ్డున 13 ఎత్తిపోతల పథకాలు నిర్మించుకున్నామని తెలిపారు.
దెబ్బతిన్న మరికొన్ని ఎత్తిపోతల పథకాలైన ఆరెపెల్లి-కొల్వాయి పథకానికి రూ. 99.80లక్షలు, జైన ఎత్తిపోతల పథకానికి రూ.33లక్షలు కేటాయించగా పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. తిమ్మాపూర్ పథకానికి రూ.95లక్షలు, రాయపట్నం పథకానికి రూ.71.50లక్షలు, ఎడపల్లి పథకానికి రూ.49.50లక్షలు, దొంతాపూర్ పథకానికి రూ.99.85లక్షలు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ సౌళ్ల భీమయ్య, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, నీటిపారుదల శాఖ ఎస్ఈ అశోక్కుమార్, ఈఈ నారాయణరెడ్డి, ఏఈఈ సాజిద్, సర్పంచ్ లహరిక తదితరులున్నారు.