హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షకు భయపడే కేంద్రం కక్ష కట్టిందని మండిపడ్డారు. ‘ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంలో కేంద్రం కుట్ర ఉన్నది. చట్టసభల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేపడితే దేశవ్యాప్తంగా తమ పరువు పోతుందని గ్రహించిన బీజేపీ పెద్దలు ఆమెను నిలువరించేందుకు కుట్ర చేశారు’ అని సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విధానాలను ప్రశ్నించే, వ్యతిరేకించే పార్టీలు, వ్యక్తులపై బీజేపీ సర్కార్ కక్షగట్టి వేధించడమే పనిగా పెట్టుకొన్నదని, ఇందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని తెలిపారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ పిచ్చి, వెర్రి పట్టినట్టుగా వ్యవహరిస్తూ.. తన చేతిలోని సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని వెల్లడించారు. బీజేపీకి పట్టిన పిచ్చికి చికిత్స చేయించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
గల్లీ గల్లీకో బ్రాంచ్ తెరుచుకోండి
దేశంలో తాము తప్ప.. ఇతర పార్టీలు ఉండకూడదనే దుష్ట విధానంతో బీజేపీ ఉన్నదని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. ఇలా దర్యాప్తు సంస్థలను తన ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలు, ప్రశ్నించిన వారిని వేధించే బదులు దేశంలో విపక్షాలు లేకుండా ఉండేలా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఒక బిల్లు తీసుకొచ్చుకోండి! అని ఎద్దేవా చేశారు. బీజేపీ తన నియంతృత్వాన్ని మరింత విజయవంతంగా కొనసాగించేందుకు ఈడీ, సీబీఐలకు బడ్జెట్ పెంచి, విపక్షాలను టార్గెట్ చేసేందుకు గల్లీ గల్లీకి వాటి బ్రాంచ్లను తెరుచుకోవాలని వ్యంగ్యంగా చురకలంటించారు. ఇష్టానుసారం విపక్ష నేతలను అరెస్టు చేయిస్తూ, దేశంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారిని కూడా వేధిస్తామనేలా బీజేపీ వ్యవహారశైలి ఉన్నదని, ఇందుకు దర్యాప్తు సంస్థలు శ్మశానాల వద్దకు వెళ్లి.. మృతదేహాలను కూడా ప్రశ్నించేలా ఒక చట్టం చేసుకోవాలని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేకే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశ అభివృద్ధి పట్టడం లేదని, ప్రతిపక్ష నేతలను వేధించడమే వారి పని అని సంజయ్సింగ్ విమర్శించారు. దేశ ప్రజలకు విద్య, వైద్యం, కరెంటు, సంక్షేమం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం బీజేపీకి అవసరం లేదని, వాళ్లకు అవసరం ఉన్నదల్లా అధికారమేనని మండిపడ్డారు. దేశ ప్రజలకు మంచి చేయటం చేతగాని కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడే నా యకులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ వారి ని జైల్లో ఉంచాలని కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ చర్యలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో ఆ పార్టీకి తప్పక బుద్ధి చెప్తామని పేర్కొన్నారు.