Adani Group – Hindenburg | అదానీ-హిండెన్బర్గ్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని పార్లమెంట్లో బీఆర్ఎస్ పట్టుబట్టింది. కేంద్ర బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అదానీ వ్యవహారం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్టీ ఎంపీలు చర్చకు పట్టుబట్టారు. వీరికి విపక్షాలు కూడా తోడయ్యాయి. దీంతో ఈ అంశం నుంచి తప్పించుకొనేందుకు ఉభయ సభలను పదే పదే వాయిదా వేశారు. సభలు పునఃప్రారంభమైనా బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగించింది. సభలను పక్కదోవ పట్టించేందుకు బీజేపీ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. బ్రిటన్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అడ్డుపెట్టి అదానీ అంశం చర్చకు రాకుండా చేశారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు, ధర్నాలతో సోమవారం పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం ప్రారంభం కాగానే అదానీ-హిండెన్బర్గ్ అంశంతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, గవర్నర్ వ్యవహారం, మహిళా రిజర్వేషన్ బిల్లు, విభజన చట్టం హామీల అమలు, పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, నిరుద్యోగం తదితర అంశాలపై బీఆర్ఎస్ సభ్యులు ఇతర విపక్షాలతో కలిసి చర్చకు పట్టుబట్టారు. బీఆర్ఎస్, టీఎంసీ, ఆప్, డీఎంకే ఎంపీలు అదానీ వ్యవహారంపై చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులపై తక్షణమే చర్చించాలని, అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ విషయమై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే కేశవరావు రాజ్యసభలో, లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో నినాదాలు చేస్తూ పోడియం వైపు దూసుకెళ్లారు.
విపక్ష సభ్యులు సభను స్తంభింపజేయడంతో ఉభయసభలు తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. తిరిగి సభలు సమావేశమైన తరువాత కూడా ఎంపీలు ఆందోళన కొనసాగించారు. కేంద్రం మొండి వైఖరి ప్రదర్శించడంతో రెండు సభలు మంగళవారానికి వాయిదాపడ్డాయి. దీంతో బీఆర్ఎస్ ఎంపీలు విపక్షాల ఎంపీలతో కలసి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనలో రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, కేఆర్ సురేశ్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధిరెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, లోక్సభ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్రెడ్డి, పీ రాములు, బీబీపాటిల్, రంజిత్రెడ్డి, బీ వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి, పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
అదానీ-హిండెన్బర్గ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ అంశాన్ని అధికార బీజేపీ పార్లమెంట్లో ప్రస్తావించింది. ప్రతిపక్షాలు పార్లమెంట్లో అదానీ అంశాన్ని ప్రస్తావించినప్పుడల్లా మైకులను స్విచ్ఛాఫ్ చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలో చట్టబద్ధమైన పాలన లేదని, ప్రధాని మోదీ దేశాన్ని ఒక నియంతలా నడుపుతున్నారని విమర్శించారు.
ప్రజా సమస్యలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం తదితర అంశాలపై చర్చకు అనుమతించకుండా కేంద్రం తప్పించుకుంటున్నదని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు కేంద్రం చెప్పుచేతల్లో నడుస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రధాని సమాధానం చెప్పేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. విపక్ష రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నదని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు.
దర్యాప్తు సంస్థలను కేంద్రం ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నదో దేశమంతా చూస్తున్నదని ఎంపీ కే కేశవరావు మండిపడ్డారు. ఢిల్లీ లికర్ పాలసీ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా సాగదీస్తూ, రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించారు. ఎమ్మెల్సీ కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా ప్రత్యక్ష విచారణకు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. అదానీ అంశంలో ప్రధానికి సంబంధాలు ఉన్నాయని, రాజకీయ జోక్యం ఉన్నందునే జేపీసీకి పట్టుబడుతున్నామన్నారు.