తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 3 : స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకుడిని మృత్యువు పిడుగురూపంలో పొట్టనబెట్టుకున్నది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనతో రాజన్నసిరిసిల్ల కేంద్రంలో విషాదం అలుముకున్నది. నిర్జీవిగా పడిఉన్న చెట్టంత కొడుకును చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కలిచివేసింది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం గణేశ్నగర్కు చెందిన పడిగే సతీశ్(32) బైక్ మోకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం ఉదయం స్నేహితులతో కలిసి సిరిసిల్ల శివారు బోనాల గ్రామం సమీపంలోని గ్రౌండ్లో క్రికెట్ ఆడేందుకువెళ్లాడు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం రావడంతో ఆటను నిలిపివేసి ఐదుగురు స్నేహితులతో కలిసి దగ్గరలో ఉన్న చెట్టు కిందకు వెళ్లారు.
ఇంతలోనే ఆ చెట్టుపై పిడిగు వేయగా చెట్టుకు ఒరిగి ఉన్న సతీశ్ పిడుగు ప్రభావానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురు మిత్రులు స్పృహకోల్పోయారు. కాగా వారందరిని జిల్లా దవాఖాకు తరలించగా అప్పటికే సతీశ్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పెద్దదిక్కు మరణంతో భార్య మధుప్రియ, తండ్రి పోచయ్య కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఏడాది క్రితం సతీశ్ రెండో అన్నయ్య ఆనారోగ్యంతో మృతి చెందాడు. ఏడాదిలోపే ఇద్దరూ కొడుకులను కోల్పోవడంతో తండ్రి పోచయ్య గుండెలవిసేలా రోదించాడు.