సిద్దిపేట : కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని వాసరి నాగమణి(50)గా పోలీసులు గుర్తించారు.
బాధితులంతా ఆందోల్ మండలం సాయిబాన్పేట్కు చెందినవారు. వీరంతా కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. కారు సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.