Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ట్రాక్టర్ నదిలోకి దూసుకెళ్లడాన్ని స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.
మంజీరా నది వద్దకు చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు వెలికితీశారు. మృతులను గోపాల్(30), రమణ(45), మల్లేశ్(30)గా పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.