Telangana | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): మత్స్యకారుల కోసం మరో రెండు సౌకర్యాలను మత్స్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. చేపల చెరువుల లీజును ఆన్లైన్లో చేసుకునేందుకు వీలుగా ‘మీ-సేవ’ యాప్తోపాటు సమస్యల నివేదన కోసం టోల్ ఫ్రీ నంబర్ 9044480333ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండింటిని సోమవారం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ బేగంపేటలోని హరితప్లాజాలో ఆవిష్కరించారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ.. చేపల చెరువులపై దళారుల పెత్తనాన్ని నిర్మూలించి మత్స్యకారులకే పూర్తి హకులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. భవిష్యత్తులో రాష్ర్టాలు, దేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుతుందని ధీమా వ్యక్తంచేశారు. మహిళా మత్స్యకారులను కూడా ప్రోత్సహించడానికి వివిధ రకాల చేపల వంటకాలపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా మత్స్య సొసైటీల్లో 45 వేల మందికి పైగా సభ్యత్వం అందజేసినట్టు తెలిపారు. రూ.1,000 కోట్లతో మత్స్యకారులకు వలలు, రూ.10 లక్షల విలువైన 150 వాహనాలను 60 శాతం సబ్సిడీపై అందజేసినట్టు తెలిపారు.
త్వరలో మత్స్యశిక్షణ కాలేజీ: పిట్టల రవీందర్
రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మత్స్యకారులకు అండగా నిలిచారని పిట్టల రవీందర్ కొనియాడారు. మత్స్యకారులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు త్వరలో శిక్షణ కాలేజీని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మెరుగైన సేవలను అందించిన అధికారుల కు మంత్రి ప్రశంసాపత్రం, మెమొంటోలను అందజేసి శాలువాతో సతరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్సిన్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా పాల్గొన్నారు.