Siddipet | చిన్నకోడూర్, సెప్టెంబర్ 12: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి వచ్చిన క్వాలిస్ ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చిన్నకోడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సిద్దిపేట ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు కరీంనగర్లో పరీక్ష రాసేందుకు క్వాలిస్ వాహనంలో వెళ్లారు.
మంగళవారం పరీక్ష రాసి తిరిగి సిద్దిపేటకు వస్తున్న క్రమంలో.. చిన్నకోడూర్ మండలం అనంతసాగర్ గ్రామం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి క్వాలిస్ వాహనం బలం గా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన కే విపిన్ చంద్ర (19), ఎన్ నాగరాజు(22), మిరుదొడ్డి మండ లం కాసులాబాద్కు చెందిన పీ గ్రీష్మ(18) ఉన్నారు. వీరితో పాటు మరో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో సాయికిరణ్, దేవచంద్, రాజు, చైతన్య, నమృత, ప్రవలిక, రోహిత్, చైతన్య ఉన్నారు. కాగా.. ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నారు.