హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): చిన్న పేగుకైనా, పెద్ద పేగుకైనా, గర్భసంచికైనా, కాలేయానికైనా, క్లోమానికైనా, మూత్రాశయానికైనా.. సర్జరీ చేసే అత్యాధునిక రోబో నిమ్స్ దవాఖానలో అందుబాటులోకి రానున్నది. మరింత వేగంగా, కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా రూ.31.5 కోట్లతో డావెన్సీ ఎక్స్ఐ రోబోను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.16.5 కోట్లతో సర్జికల్ న్యూరో, సర్జికల్ యూరాలజీ విభాగాలకు చెందిన అత్యాధునిక వైద్య పరికరాలను కూడా సమకూర్చింది. వీటిని సోమవారం వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. రోబో సహా వైద్య పరికరాల సేవలు ఈ నెల 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా, మరో రూ.32 కోట్ల విలువైన వైద్య పరికరాలు కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
ఎలాంటి కోత లేకుండానే చిన్నపాటి రంధ్రం ద్వారా ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. పొట్ట, ఛాతి, రెక్టమ్ కెనాల్, కాలేయం తదితర అవయవాల్లో ఎంతటి క్లిష్టమైన సర్జరీలనైనా సులభంగా చేయవచ్చని బీరప్ప వెల్లడించారు. రోబోకు ఉన్న చేతులు 360 డిగ్రీలు తిరగగలవని, తద్వారా మనిషి వేళ్లు వెళ్లలేని ప్రాంతంలోనూ సర్జరీ చేసేందుకు వీలుంటుందని, అదీ తక్కువ సమయంలోనేనని వివరించారు. ఈ రోబో సేవలను ప్రస్తుతానికి సర్జికల్ గ్యాస్ట్రో, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ యూరాలజీ విభాగాల్లో సర్జరీలు చేయనున్నట్టు తెలిపారు.
సాధారణంగా శస్త్రచికిత్స సమయంలో ఏ యంత్రాన్ని వినియోగించినా వైద్యుడు రోగి వద్ద ఉండి సర్జరీ చేస్తారు. కానీ, రోబోతో సర్జరీ చేసే సమయంలో వైద్యుడు రోగి వద్ద కాకుండా కన్సోన్ అనే యంత్రం వద్ద ఉంటారు. ప్రస్తుతం నిమ్స్లో కొత్తగా వచ్చిన రోబోకు రెండు కన్సోల్స్ ఉన్నాయి. అందులోని ఒక కన్సోల్లో వైద్యుడు ఉండి సర్జరీ చేస్తారు. మరో కన్సోల్లో వైద్య విద్యార్థి కూర్చొని రోబో ద్వారా చేసే శస్త్రచికిత్స పద్ధతిని పరిశీలిస్తూ శిక్షణ పొందుతారు. అంటే ఈ రోబో ద్వారా ఒక పక్క రోగికి చికిత్స చేయడమే కాకుండా మరో పక్క వైద్య విద్యార్థులకు శిక్షణ కూడా ఇస్తారన్న మాట. వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు రోబో తయారీ కంపెనీ నిపుణుడు (ప్రొక్టార్) పర్యవేక్షిస్తాడు. ప్రతి సర్జరీ రికార్డ్ అవుతుంది. సర్జన్లు పొరపాటు చేస్తే ప్రొక్టార్ వెంటనే స్పందించి సూచనలు ఇస్తారు. రోబో ద్వారా శస్త్రచికిత్సలు చేయడానికి 20 నిపుణులకు శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటికే ఇద్దరు శిక్షణ పూర్తి చేసుకున్నారని బీరప్ప వెల్లడించారు. మిగిలిన 18 మందికి శిక్షణ కొనసాగుతున్నదని, వారి శిక్షణ త్వరలోనే పూర్తికానున్నదని పేర్కొన్నారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చే రోబో తో ఎంత క్లిష్టమైన సర్జరీలనైనా సులవుగా చేయవచ్చు. త క్కువ సమయంలో ఎక్కువ సర్జరీలు చేసే వీలుంటుంది. ఇప్పుడున్న రోబోల కన్నా ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకొన్నది. దీని సక్సెస్ రేటు 90శాతానికి పైగా ఉంటుం ది. ఇన్ఫెక్షన్లకు అవకాశం ఉండదు. కుట్లతో పనిలేదు. నిమ్స్ చరిత్రలోనే ఈ రోబో ఖరీదైన యంత్రం. దీన్ని సీఎం కేసీఆర్ నిమ్స్కు ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తున్నాం.
– డాక్టర్ బీరప్ప, డైరెక్టర్ నిమ్స్