హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని అక్టోబర్ 27న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే ప్రేమేందర్రెడ్డి సిట్ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 18న మరో పిటిషన్ వేశారు. ఇక ఢిల్లీ బీజేపీ నేతలు సైతం ఆగమేఘాలపై ఇదే విషయంలో ఎన్నికల సంఘంశరణుజొచ్చారు. తాజాగా ఎమ్మెల్యేల ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడు రామచంద్రభారతితో సన్నిహిత సంబంధాలున్నట్టు చెప్తున్న కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ అంశంపై మరోమారు చర్చ జోరందుకుంది. అయితే.. బీజేపీ నేతలు సీబీఐ విచారణ ఎందుకు కోరుకుంటున్నారు? సిట్ దర్యాప్తును ఎందుకు వద్దంటున్నారు? నిజానికి ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే అనేక కీలక అంశాలను సిట్ ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నది. దీంతో బీజేపీ నాయకుల్లో బుగులు రేగింది.
పలు రాష్ర్టాల్లోని బీజేపీ నాయకులు, వారి అనుంగుల పేర్లు సైతం బయటకు వస్తుండటంతో వణుకు మొదలైంది. కంటి మీద కునుకు లేకుండా పోయిన బీజేపీ నాయకులు.. సిట్ విచారణ అంటేనే ఉలిక్కి పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒకటి చేసి.. ఈ కేసును సీబీఐ పరిధిలోకి తెచ్చుకుంటే.. ఇకపై దర్యాప్తు అంతా కేంద్రం చెప్పినట్టు సాగుతుందనే ఆశాభావంతో బీజేపీ నేతలు ఉన్నట్టు కనిపిస్తున్నది. అందుకే స్థానిక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు బీజేపీ నాయకులు దాఖలు చేస్తున్న పిటిషన్లలో ఒక్కటే డిమాండ్.. ‘ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాలి.. సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలి’. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు సైతం ఈ నెల 4న జరిపిన విచారణ సందర్భంగా తీవ్రంగా తప్పుపట్టింది. అయినా.. తుషార్ వెల్లపల్లి మళ్లీ సీబీఐ దర్యాప్తు రాగం అందుకోవడంపై రాజకీయ వర్గాల్లో మరోమారు చర్చ మొదలైంది.
సిట్ వద్దు.. సీబీఐనే ముద్దు
విచిత్రం ఏమిటంటే.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్తూ, తడిబట్టల ప్రమాణాలు చేస్తూ మరోవైపు ఈ కేసుపై బీజేపీ నేతలు కోర్టులో వరుస పిటిషన్లు వేస్తున్నారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్, అధికార ప్రతినిధి అనిల్ బలూనీ, క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఓం పాఠక్ల బృందం సైతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు కోరుతూ అక్టోబర్ 28న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తుషార్ సైతం సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకు వెళ్లడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే దర్యాప్తు సంస్థ సీబీఐకి ఈ కేసు వెళితే తమకు ఇబ్బందులు ఉండవన్నదే బీజేపీ లక్ష్యమని పలువురు పేర్కొంటున్నారు.